TDP: 40 ఏళ్ల క్రితం చ‌రిత్ర సృష్టించిన రోజు ఇదే: చంద్ర‌బాబు

  • ఎన్టీఆర్ ట్ర‌స్ట్ భ‌వ‌న్‌లో ప్రారంభ‌మైన టీడీపీ వేడుక‌లు
  • కీల‌క ప్ర‌సంగం చేసిన అధినేత చంద్ర‌బాబు
  • టీడీపీకి ముందు, టీడీపీ త‌ర్వాత అన్న‌ట్లుగా ప్ర‌స్తుత ప‌రిస్థితి
  • తెలుగు జాతిని, టీడీపీని విడ‌దీయ‌లేర‌ని వ్యాఖ్య‌
chandra babu speech at tdp 40years celebrations

తెలుగు దేశం పార్టీ (టీడీపీ) 40 వ‌సంతాల వేడుక‌లు మంగ‌ళ‌వారం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభ‌మ‌య్యాయి. హైద‌రాబాద్‌లోని ఎన్టీఆర్ ట్ర‌స్ట్ భ‌వ‌న్ వేదిక‌గా ప్ర‌ధాన వేడుక‌లు ప్రారంభం కాగా..పార్టీ జాతీయ అధ్య‌క్షుడు నారా చంద్రబాబునాయుడు ఈ వేడుక‌ల‌ను ఉద్దేశించి కీల‌క ప్ర‌సంగం చేశారు. 

40 ఏళ్ల క్రితం ఇదే రోజున చ‌రిత్ర సృష్టించామ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. తెలుగు జాతికి జ‌రిగిన అవ‌మానాలు చూసిన త‌ర్వాత 40 ఏళ్లుగా త‌న‌ను ఆద‌రించిన తెలుగు జాతికి ఏం చేయాల‌న్న దిశ‌గా ఎన్టీఆర్ ఆలోచించార‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఆ ఆలోచ‌న‌ల నుంచే టీడీపీ పుట్టుకొచ్చింద‌ని చంద్ర‌బాబు పేర్కొన్నారు.

నాడు పార్టీ ప్ర‌క‌ట‌న కోసం ఆద‌ర్శ న‌గ‌ర్‌లోని ఎమ్మెల్యే క్వార్ట‌ర్స్‌కు ఎన్టీఆర్ అతి కొద్ది మందితో చేరుకోగా.. ఎన్టీఆర్ నుంచి ఓ ప్ర‌క‌ట‌న రాగానే.. అక్క‌డికి వేలాది మంది త‌ర‌లివ‌చ్చార‌ని చంద్ర‌బాబు చెప్పారు. రాష్ట్ర ప్రయోజ‌నాల‌ను ఆశించే నాడు ఎన్టీఆర్ టీడీపీని ప్రారంభించార‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ ప్రారంభించిన టీడీపీ ఇటు రాష్ట్ర రాజ‌కీయాల్లోనే కాకుండా జాతీయ రాజ‌కీయాల్లోనూ ఓ బెంచ్ మార్కును సృష్టించింద‌ని ఆయ‌న తెలిపారు. ప్ర‌స్తుత రాజ‌కీయాల‌ను చూస్తే.. టీడీపీకి ముందు, టీడీపీ త‌ర్వాత అన్నట్టుగా ప‌రిస్థితి త‌యారైంద‌ని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు.

పార్టీ ప్రారంభమైన త‌ర్వాత ఈ 40 ఏళ్ల‌లో ఎన్నో రికార్డుల‌ను లిఖించామ‌ని చెప్పిన చంద్ర‌బాబు.. ఎన్నో రికార్డుల‌ను కూడా బ్రేక్ చేశామ‌ని తెలిపారు. తాజా ప‌రిస్థితుల్లో మ‌రోమారు తెలుగు జాతికి పునరంకితం కావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆయ‌న కార్య‌క‌ర్త‌ల‌కు పిలుపునిచ్చారు. ఈ కార‌ణంతోనే పార్టీ పుట్టిన ప్ర‌దేశానికి వ‌చ్చామ‌ని చంద్ర‌బాబు పేర్కొన్నారు. తెలుగు జాతిని, టీడీపీని ఏ ఒక్క‌రూ విడ‌దీయ‌లేర‌ని కూడా చంద్ర‌బాబు పేర్కొన్నారు.

More Telugu News