NTR Trust Bhavan: టీడీపీ 40 వ‌సంతాల వేడుక ఎఫెక్ట్‌.. ఎన్టీఆర్ ట్ర‌స్ట్ భ‌వ‌న్‌కు క‌ళ‌

  • టీడీపీ కేంద్ర కార్యాల‌యంగా ఎన్టీఆర్ ట్ర‌స్ట్ భ‌వ‌న్‌
  • నిత్యం సందడిగా క‌నిపించిన పరిస‌రాలు
  • రాష్ట్ర విభ‌జ‌న‌తో క‌ళ త‌గ్గిన ట్ర‌స్ట్ భ‌వ‌న్‌
  • పార్టీ వేడుక‌ల‌తో తాజాగా స‌రికొత్త క‌ళ‌తో పార్టీ కార్యాల‌యం
new josh at ntr trust bhavan in hyderabad

చాలా రోజుల త‌ర్వాత హైద‌రాబాద్‌లోని ఎన్టీఆర్ ట్ర‌స్ట్ భ‌వ‌న్‌కు క‌ళ వ‌చ్చింది. తెలుగునేల రెండు రాష్ట్రాలుగా విడిపోక ముందు టీడీపీ కేంద్ర కార్యాల‌యంగా కొన‌సాగిన ఎన్టీఆర్ ట్ర‌స్ట్ భ‌వ‌న్ నిత్యం పార్టీ కార్య‌క‌ర్త‌ల రాక‌పోక‌ల‌తో సంద‌డిగా క‌నిపించేది. రాత్రి వేళల్లోనూ భ‌వ‌న్ ఆవ‌ర‌ణ‌లో ఏదో ఒక కార్య‌క్ర‌మం జ‌రుగుతూనే ఉండేది. నాడు హైద‌రాబాద్‌లోని అన్ని పార్టీల కార్యాల‌యాల‌ను చూసుకున్నా.. వాటిలో ఎన్టీఆర్ ట్ర‌స్ట్ భ‌వ‌నే క‌ళ‌క‌ళ‌లాడుతూ క‌నిపించేది.

అయితే ఎప్పుడైతే తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిందో.. అప్ప‌టి నుంచి ఎన్టీఆర్ ట్ర‌స్ట్ భ‌వ‌న్‌లో కార్య‌క‌లాపాలు త‌గ్గుముఖం ప‌ట్ట‌డం ప్రారంభ‌మ‌య్యాయి. 2014 ఎన్నిక‌ల్లో పార్టీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు ఏపీ సీఎంగా ఎన్నిక కావ‌డం, ఆ త‌ర్వాత ఆయ‌న రాజ‌ధానిని అమ‌రావ‌తికి త‌ర‌లించ‌డంతో భ‌వ‌న్‌లో కార్య‌క‌లాపాలు మ‌రింత‌గా స‌న్న‌గిల్లాయి. అదే స‌మ‌యంలో తెలంగాణ‌కు చెందిన కీల‌క నేత‌లు ఇత‌ర పార్టీల్లో చేరిపోవ‌డంతో ఎన్టీఆర్ ట్ర‌స్ట్ భ‌వ‌న్ క‌ళా విహీనంగా మారిపోయింది.

తాజాగా టీడీపీ40 వ‌సంతాల వేడుక నేప‌థ్యంలో ఎన్టీఆర్ ట్ర‌స్ట్ భ‌వ‌న్‌కు కొత్త క‌ళ వ‌చ్చింది. వేడుక‌ల‌ను ట్ర‌స్ట్ భ‌వ‌న్‌లో కాసేప‌టి క్రితం చంద్ర‌బాబు ప్రారంభించారు. ఈ వేడుక‌ల‌కు తెలంగాణ నుంచే కాకుండా ఏపీ నుంచి కూడా పెద్ద సంఖ్య‌లో పార్టీ శ్రేణులు హాజ‌ర‌య్యాయి. దీంతో మ‌రోమారు ఎన్టీఆర్ ట్ర‌స్ట్ భ‌వ‌న్ కార్య‌క‌ర్త‌ల జోష్‌తో క‌ళ‌క‌ళ‌లాడుతూ క‌నిపించింది.

More Telugu News