Ukraine: ముగిసిన 'యుద్ధం' చ‌ర్చ‌లు.. ఓ మోస్త‌రు ఫ‌లితం అయితే వ‌చ్చిన‌ట్టే!

russia ukraine peace talks concludes in istambul
  • ఇస్తాంబుల్‌లో ముగిసిన ర‌ష్యా, ఉక్రెయిన్ చ‌ర్చ‌లు
  • కీవ్, చెర్నివ్‌ల‌ నుంచి సేన‌ల ఉప‌సంహ‌ర‌ణ‌కు ర‌ష్యా అంగీకారం
  • ఇత‌ర అంశాల‌పై ఇరు దేశాల మ‌ధ్య ప్ర‌తిష్టంభ‌న‌

యుద్ధంలో హోరాహోరీగా త‌ల‌ప‌డుతున్న ర‌ష్యా, ఉక్రెయిన్‌ల మ‌ధ్య ఆరో విడ‌త చ‌ర్చ‌లు కాసేప‌టి క్రితం ముగిశాయి. ట‌ర్కీలోని ఇస్తాంబుల్ వేదిక‌గా జ‌రిగిన ఈ చ‌ర్చ‌ల్లో పూర్తి ఫ‌లిత‌మైతే రాలేదు గానీ.. ఓ మోస్త‌రు ఫ‌లితం అయితే వ‌చ్చిన‌ట్టేన‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. రెండు దేశాల ప్ర‌తినిధులు సుధీర్ఘంగా ఈ చ‌ర్చ‌ల్లో పాలు పంచుకోగా.. ఇరు దేశాలు కూడా త‌మ త‌మ వాద‌న‌ల‌కే కట్టుబ‌డి ముందుకు సాగాయి.

చ‌ర్చ‌ల్లో భాగంగా త‌క్ష‌ణ‌మే యుద్ధం ఆపాల‌ని ఉక్రెయిన్ త‌న పాత డిమాండ్‌నే వినిపించింది. ఈ డిమాండ్‌కు ఆదిలో అంత‌గా స్పందించ‌ని ర‌ష్యా.. ఈ ద‌ఫా మాత్రం కాస్తంత సానుకూలంగానే స్పందించింది. ఉక్రెయిన్ రాజ‌ధాని కీవ్‌, మ‌రో ప్ర‌ధాన న‌గ‌రం చెర్నివ్‌ల‌ నుంచి త‌మ సేన‌ల‌ను క్ర‌మంగా ఉప‌సంహ‌రించుకునేందుకు ర‌ష్యా అంగీక‌రించింది.

ఈ కొత్త ప్ర‌తిపాద‌న‌ల‌పై స‌మీక్షించుకుని ముందుకు సాగుతామ‌ని ర‌ష్యా ప్ర‌తినిధులు తెలిపారు. వెర‌సి ఐదు విడ‌త‌ల్లో ఏమాత్రం సానుకూల అంశాలు క‌నిపించ‌క‌పోగా... ఆరో విడ‌తలో మాత్రం కాస్తంత సానుకూల ఫ‌లితం అయితే వ‌చ్చింద‌నే చెప్పాలి.

  • Loading...

More Telugu News