Dollars: ఉక్రెయిన్‌కు సాయంగా అమెరికాలో గుజరాతీ సింగర్ లైవ్ షో.. డాలర్ల వర్షం కురిపించిన ఎన్నారైలు

  • ఉక్రెయిన్‌కు నిధుల సేకరణ కోసం గీతాబెన్ సంగీత కచేరి
  • అట్లాంటా, జార్జియాలలో ప్రదర్శనకు పోటెత్తిన ఎన్నారైలు
  • రూ. 2.25 కోట్లు వెదజల్లిన ప్రేక్షకులు 
  • త్వరలోనే ఉక్రెయిన్‌కు అందజేత
Dollars Rain At Gujarati Singer US Concert

రష్యా యుద్ధంతో చితికిపోతున్న ఉక్రెయిన్‌కు ఆర్థిక సాయం అందించేందుకు అమెరికాలో గుజరాతీ సింగర్ నిర్వహించిన లైవ్ షోలో డాలర్ల వర్షం కురిసింది. ఉక్రెయిన్‌కు సాయం అందించే ఉద్దేశంతో గుజరాతీ ఎన్నారైలు ఆదివారం జార్జియా, అట్లాంటాలో లైవ్ షో ఏర్పాటు చేశారు. గుజరాతీ జానపద గాయని గీతాబెన్ రాబరి సంగీత కచేరి నిర్వహించారు. 

‘లోకే దేరో’ పేరుతో నిర్వహించిన ఈ రెండు ప్రదర్శనలకు పెద్ద ఎత్తున హాజరైన ఎన్నారైలు గీతాబెన్‌పై డాలర్ల వర్షం కురిపించారు. దీంతో ఆ స్టేజీ మొత్తం డాలర్ల నోట్లతో నిండిపోయింది. నోట్లతో నిండిన స్టేజి ఫొటోలను గీతాబెన్ తన ఇన్‌స్టాలో షేర్ చేయడంతో అవి కాస్తా వైరల్ అయ్యాయి. ఉక్రెయిన్‌కు మద్దతుగా నిర్వహించిన ఈ రెండు షోల ద్వారా భారీగా నిధులు సమకూరినట్టు సూరత్ ల్యూవా పటేల్ సమాజ్ (ఎస్ఎల్‌పీఎస్) వెల్లడించింది. 

ఈ కార్యక్రమాల ద్వారా 3 లక్షల డాలర్లు.. భారత కరెన్సీలో దాదాపు 2.25 కోట్ల రూపాయలు విరాళంగా వచ్చినట్టు తెలిపింది. త్వరలోనే ఈ సొమ్మును ఉక్రెయిన్‌కు అందిస్తామని వివరించింది. కాగా, గాయని గీతాబెన్ (26)కు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. ఫిబ్రవరి 2020లో అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరిగిన ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమంలో మోదీ, డొనాల్డ్ ట్రంప్ ఎదుట గీతాబెన్ ప్రదర్శన ఇచ్చారు.

More Telugu News