The Kashimir Files: కశ్మీర్ ఫైల్స్ సినిమాను అందరూ చూడాలని చెప్పడం కంటే యూట్యూబ్‌లో విడుదల చేస్తే సరిపోతుంది కదా: మనీశ్ సిసోడియా

  • కశ్మీరీ పండింట్ల క్షోభను బీజేపీ  రూ. 200 కోట్లకు విక్రయించింది
  • బీజేపీ ఆలోచన సినిమా గురించే
  • మేం కశ్మీరీ పండిట్ల దుస్థితి గురించి ఆలోచిస్తున్నాం
Worried for The Kashmir Files not the Kashmiri Pandits Manish Sisodia attack on BJP

ది కశ్మీర్ ఫైల్స్ సినిమాను అందరూ చూడాలని చెబుతున్న బీజేపీ.. దానిని యూట్యూబ్‌లో విడుదల చేస్తే సరిపోతుంది కదా? అని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అన్నారు. ఢిల్లీ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీపై నిప్పులు చెరిగారు. కశ్మీరీ పండిట్ల క్షోభను బీజేపీ రూ. 200 కోట్లకు విక్రయించిందని మండిపడ్డారు.

 బీజేపీ ఆ సినిమా గురించి ఆలోచిస్తుంటే తాము మాత్రం కశ్మీరీ పండిట్ల దుస్థితిపై ఆలోచిస్తున్నామన్నారు. ఆ సినిమా ఇప్పటి వరకు వసూలు చేసిన రూ. 200 కోట్లను కశ్మీరీ పండిట్ల సంక్షేమం కోసం వినియోగించాలని డిమాండ్ చేశారు. ఈ సినిమాను ప్రతి ఒక్కరు చూడాలని బీజేపీ నేతలు చెబుతున్నారని, అలాంటప్పుడు దానిని యూట్యూబ్‌లో విడుదల చేస్తే సరిపోతుంది కదా అని అన్నారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ది కశ్మీర్ ఫైల్స్ సినిమాపై ఇటీవల మాట్లాడుతూ.. ఈ సినిమాను బీజేపీ రాజకీయం చేస్తోందని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన ఈ 8 ఏళ్లలో ఒక్క కశ్మీర్ పండిట్ కుటుంబాన్ని అయినా కశ్మీర్‌కు తరలించిందా? అని ప్రశ్నించారు. ది కశ్మీర్ ఫైల్స్ సినిమా పోస్టర్లను అంటించే పనిలో బీజేపీ కార్యకర్తలు బిజీగా ఉన్నారని కేజ్రీవాల్ దుయ్యబట్టారు.

More Telugu News