Gujarat Titans: లక్నోపై గుజరాత్‌దే పైచేయి.. 5 వికెట్ల తేడాతో విజయం

  • కొత్త జట్లు అయిన ఈ రెండింటి మధ్య తొలిపోరు
  • తొలుత తడబడినా తర్వాత నిలదొక్కుకున్న లక్నో
  • బ్యాటింగ్‌లో రాణించి బోణీ కొట్టిన గుజరాత్ టైటాన్స్
Gujarat Titans won by 5 wkts against LSG

ఐపీఎల్‌లో భాగంగా గత రాత్రి లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్‌తో ఐపీఎల్‌లో అడుగుపెట్టిన ఈ రెండు జట్ల మధ్య తొలి పోటీ ఇదే. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ప్రత్యర్థి ఎదుట 159 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. 

ఓ మోస్తరు విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ జట్టు మరో రెండు బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. తొలి ఓవర్ మూడో బంతికే శుభమన్ గిల్ (0), 15 పరుగుల వద్ద విజయ్ శంకర్ అవుటైనప్పటికీ మాథ్యూవేడ్ (30), కెప్టెన్ హార్దిక్ పాండ్యా (33), డేవిడ్ మిల్లర్ (30) రాణించడానికి తోడు చివర్లో రాహుల్ తెవాటియా బౌలర్లపై విరుచుకుపడి జట్టుకు విజయాన్ని అందించాడు. 24 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 40 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 

ఇక అభినవ్ మనోహర్ 7 బంతుల్లో 3 ఫోర్లతో 15 పరుగులు చేయడంతో మరో రెండు బంతులు మిగిలి ఉండగానే విజయం గుజరాత్ ఖాతాలో చేరింది. లక్నో బౌలర్లలో దుష్మంత చమీర 2 వికెట్లు పడగొట్టగా, అవేశ్ ఖాన్, కృనాల్ పాండ్యా, దీపక్ హుడా చెరో వికెట్ తీసుకున్నారు. .

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు మహ్మద్ షమీ నిప్పులు చెరిగే బంతులకు కకావికలైంది. ఇన్నింగ్స్ తొలి బంతికే కెప్టెన్ కేఎల్ రాహుల్‌ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. అది మొదలు వికెట్లు వరుసపెట్టి రాలాయి. ఐదు ఓవర్లు కూడా పూర్తికాకముందే 29 పరుగులకే నాలుగు కీలక వికెట్లు .. కేఎల్ రాహుల్ (0), డికాక్ (7), లూయిస్ (10), మనీష్ పాండే (6) వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే, దీపక్ హుడా, అయూష్ బదోని ఇద్దరూ క్రీజులో నిలబడి జట్టును నిలబెట్టే ప్రయత్నం చేశారు.

ఓ వైపు బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూనే మరోవైపు, పరుగులు రాబట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇద్దరూ అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. దీపక్ 41 బంతుల్లో 6 ఫోర్లు 2 సిక్సర్లతో 55 పరుగులు చేయగా, ఆయుష్ బదోని 41 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 54 పరుగులు చేశాడు. 

చివర్లో కృనాల్ పాండ్యా 13 బంతుల్లో 3 ఫోర్లతో 21 పరుగులు చేయడంతో లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 158 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. గుజరాత్ బౌలర్లలో షమీ 3 వికెట్లు పడగొట్టగా, అరోన్ 2, రషీద్ ఖాన్‌కు ఓ వికెట్ దక్కింది. షమీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

More Telugu News