Hyderabad: హైదరాబాద్‌ చైతన్యపురిలో దారుణం.. ఉద్యోగం పేరుతో యువతిపై అత్యాచారం

  • ఉద్యోగం ఇస్తానని ఫోన్ చేసి నమ్మించిన సిద్ధార్థరెడ్డి  
  • దిల్‌సుఖ్ నగర్ కు వచ్చి ఎస్సార్ నగర్ తీసుకెళ్లిన వైనం
  • ఆమె పేరుతో లాడ్జీ బుక్ చేసి అత్యాచారం
  • బయటపెడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిక
Man raped Young girl in the name of a job

ఉద్యోగం పేరుతో ఓ యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడో యువకుడు. హైదరాబాద్‌లోని చైతన్యపురి పోలీస్ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలానికి చెందిన 19 ఏళ్ల యువతి నాలుగు సంవత్సరాలుగా దిల్‌సుఖ్‌నగర్‌లోని చైతన్యపురికాలనీలో ఉంటూ టెలీకాలర్‌గా పనిచేస్తోంది.  ఈ నెల 7న సిద్ధార్థరెడ్డి అనే వ్యక్తి ఆమెకు ఫోన్ చేసి తమ కంపెనీలో ఉద్యోగం ఉందని, నెలకు రూ. 18 వేల జీతం ఇస్తామని నమ్మించాడు.

అతడి మాటలు నమ్మిన యువతి ఉద్యోగానికి అంగీకరించింది. దీంతో ఈ నెల 9న కారులో దిల్‌సుఖ్‌నగర్ వచ్చిన నిందితుడు (23) యువతిని ఎక్కించుకుని ఎర్రగడ్డ తీసుకెళ్లాడు. ఆమె నుంచి గుర్తింపు కార్డులు, ఫొటోలు తీసుకున్నాడు. అనంతరం ఎస్సార్ నగర్‌లోని ఓ లాడ్జీలో యువతి పేరిట రూమ్ బుక్ చేశాడు. దీంతో భయపడిన యువతి ఉద్యోగం గురించి ప్రశ్నించింది. అయితే, రాత్రి భోజనం తర్వాత దాని గురించి మాట్లాడుకుని అడ్వాన్స్ ఇస్తానని నమ్మించి లాడ్జ్‌కు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 

ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, ఫొటోలు మీడియాకు ఇస్తానని బెదిరించాడు. ఎలాగోలా అతడి బారి నుంచి తప్పించుకున్న బాధితురాలు కుటుంబ సభ్యులతో కలిసి చైతన్యపురి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అక్కడ జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న పోలీసులు కేసును ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

More Telugu News