Tamil Nadu: ప్రియుడి కళ్లెదుటే ప్రియురాలిపై అత్యాచారం.. పోలీసులపై దాడిచేసి తప్పించుకున్న నిందితులు

  • తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో ఘటన
  • బీచ్‌కు వెళ్లి ప్రేమికులు.. ప్రియుడిపై దాడి
  • యువతిపై అత్యాచారం చేసి ఆపై నగలతో పరారీ
Hunt for Virudhunagar Rape Case accused

తమిళనాడులోని విరుదునగర్ జిల్లా అరుప్పుకోటలో దారుణం జరిగింది. ప్రేయసిపై తన కళ్లముందే జరిగిన అత్యాచారాన్ని చూసి తట్టుకోలేని యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ కేసుకు సంబంధించి పోలీసుల కథనం ప్రకారం.. అరుప్పుకోటకు చెందిన యువతి ప్రియుడితో కలిసి ఈ నెల 23న బీచ్‌కు వెళ్లింది. అక్కడ ఇద్దరూ ముచ్చట్లాడుకుంటుండగా వారిని గమనించిన ముగ్గురు వ్యక్తులు అక్కడికొచ్చారు. యువకుడిని చావబాది అతడి కళ్లెదుటే యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. అనంతరం ఆమె మెడలోని నగలను దోచుకుని పరారయ్యారు. 

ఈ ఘటనతో తీవ్ర మనస్తాపం చెందిన ప్రియుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. మరోవైపు, బాధిత యువతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు పద్మాశ్వరన్, దినేష్ కుమార్, అజిత్‌లను అరెస్ట్ చేసేందుకు వెళ్లారు. పోలీసులను గమనించిన నిందితులు వారిపై దాడిచేసి పరారయ్యారు. నిందితుల కోసం గాలిస్తున్నామని, త్వరలోనే వారిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

More Telugu News