Telangana: సెల్‌ఫోన్ కోసం తల్లితో గొడవ.. కొనివ్వలేదని రోకలిబండతో మోది హత్య

  • తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలో ఘటన
  • ఆవేశంతో విచక్షణ కోల్పోయి రోకలిబండతో మోదిన వైనం
  • తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందిన తల్లి
son killed mother for not buy a cell phone

మొబైల్ ఫోన్ కొనివ్వాలంటూ తల్లితో గొడవ పడిన కుమారుడు.. నిరాకరించిందన్న కోపంతో ఆమెను దారుణంగా హతమార్చాడు. తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం శేరిపల్లి గ్రామంలో జరిగిందీ ఘటన. 

పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన లక్ష్మి (52), వెంకటేశ్వర్ల దంపతుల పెద్ద కుమారుడు మహేశ్ ఇంటర్ పూర్తిచేసి కూలిపనులు చేస్తున్నాడు. తనకు సెల్‌ఫోన్ కొనివ్వాలంటూ గత కొంతకాలంగా తల్లితో గొడవపడుతున్నాడు. అయితే, డబ్బులు లేవని, తర్వాత చూద్దామని తల్లి చెప్పింది. 

ఈ క్రమంలో సెల్‌ఫోన్ కోసం నిన్న మధ్యాహ్నం మరోమారు తల్లీకొడుకుల మధ్య వాగ్వివాదం జరిగింది. అది మరింత ముదరడంతో ఆగ్రహంతో విచక్షణ కోల్పోయిన మహేశ్ రోకలిబండతో తల్లి తలపై బలంగా మోదాడు. తీవ్రంగా గాయపడిన ఆమె కిందపడింది. చుట్టుపక్కల వారు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అయితే, అది వచ్చేసరికే లక్ష్మి ప్రాణాలు కోల్పోయింది. ఆమె అక్క దేవమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News