Arvind Dharmapuri: బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

  • టీఆర్ఎస్ ఫ్లెక్సీలు, హోర్డింగులను చింపి వేసిన కేసు
  • కేసీఆర్, కేటీఆర్ లను దుర్భాషలాడారని ఆరోపణలు  
  • కోర్టు విచారణకు హాజరుకాకపోవడంతో వారెంట్ జారీ
Non bailable warrant issued to Darmapuri Arvind

బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కు నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేసింది. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లను దుర్భాషలాడటం, టీఆర్ఎస్ ఫ్లెక్సీలు, హోర్డింగులను చింపి వేయడం కేసుల్లో విచారణ చేపట్టిన ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం వారెంట్ జారీ చేసింది. 

కేసు వివరాల్లోకి వెళ్తే... జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా 2020 నవంబర్ 23న కేబీఆర్ పార్క్ వద్ద టీఆర్ఎస్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, హోర్డింగ్ లను అరవింద్, ఆయన అనుచరులు చింపి వేశారంటూ కేసు నమోదైంది. అంతేకాదు కేసీఆర్, కేటీఆర్ లను దుర్భాషలాడారని అప్పట్లో టీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ హోదాలో ఉన్న ప్రస్తుత ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ ఫిర్యాదు చేశారు. 

ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో ఛార్జ్ షీట్ వేశారు. అయితే కోర్టు విచారణకు తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉన్నప్పటికీ ఆయన హాజరు కాకపోవడంతో... కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది.

More Telugu News