Bandi Sanjay: 'కశ్మీర్ ఫైల్స్' కు వ్యతిరేకంగా మాట్లాడుతున్న సీఎంకు డీఎన్ఏ టెస్టు చేయాలి: కేసీఆర్ పై బండి సంజయ్ ఫైర్

  • కేసీఆర్ కు ఇలాంటి సినిమాలు నచ్చవన్న సంజయ్
  • దోపిడీదొంగలు వంటి చిత్రాలు నచ్చుతాయని వ్యంగ్యం
  • త్వరలో అవినీతి ఫైల్స్ తీసుకువస్తామని వ్యాఖ్యలు
  • ఈసారి కేసీఆర్ కు 10 సీట్లు కూడా రావన్న సంజయ్   
Bandi Sanjay slams CM KCR over The Kashmir Files movie

తెలంగాణ సీఎం కేసీఆర్ పై రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 'ది కశ్మీర్ ఫైల్స్' చిత్రానికి యావత్ ప్రపంచం నీరాజనాలు అర్పిస్తోందని, కానీ కేసీఆర్ కు మాత్రం ఆ సినిమా నచ్చడంలేదని అన్నారు. కేసీఆర్ కు ఇలాంటి సినిమాలు నచ్చవని, 'దోపిడీ దొంగలు' వంటి సినిమాలు నచ్చుతాయని విమర్శించారు. 'కశ్మీర్ ఫైల్స్' చిత్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న సీఎంకు డీఎన్ఏ టెస్టు చేయించాలని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. 

"కశ్మీర్ ఫైల్స్ సినిమాతో నీకేంటి ఇబ్బంది? ఎందుకంత అక్కసు? ఆర్టికల్ 370 వల్ల కశ్మీర్ లో ఏం జరిగిందో తెలుసుకో. కశ్మీర్ పండిట్లపై జరిగిన అరాచకాలను ప్రజలకు చూపిస్తే, ఇదొక పనికిమాలిన సినిమా అంటూ పనికిమాలిన బుద్ధులు చూపిస్తావా?" అంటూ బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

"కశ్మీర్ లో జరిగిన దారుణాలు నిజం కాదా? తెలంగాణలో కేసీఆర్ రజాకార్ల పాలన నడిపిస్తున్నారు. కశ్మీర్ ఫైల్స్ తరహాలోనే త్వరలోనే రజాకార్ ఫైల్స్, అవినీతి ఫైల్స్, ఓల్డ్ సిటీ ఫైల్స్ తీసుకొస్తాం" అని స్పష్టం చేశారు. 

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు ఉన్నంత జ్ఞానం కూడా కేసీఆర్ కు లేదని బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో భారత ప్రభుత్వ విదేశాంగ విధానాన్ని ఇమ్రాన్ ప్రశంసిస్తుంటే... కేసీఆర్ మాత్రం విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. 4 రాష్ట్రాల్లో బీజేపీ గెలవడంతో మైండ్ దొబ్బిందని, ఫాంహౌస్ దాటి బయటికి రావడంలేదని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో 10 సీట్లు కూడా రావని స్పష్టం చేశారు. మోసకారి కేసీఆర్ మాటలను రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.

More Telugu News