Coffee: మళ్లీ ప్రియం కానున్న నిత్యావసరాల ధరలు.. 10-15 శాతం పెరిగే అవకాశం

  • అంతర్జాతీయ కమోడిటీ ధరల్లో హెచ్చుతగ్గులు
  • పెరిగిన ప్యాకేజీ ధరలు
  • భారాన్ని వినియోగదారులకు బదిలీ చేయాలని నిర్ణయం
FMCG Companies decided to hike price

భారత్‌లో నిత్యావసరాల ధరలు మళ్లీ పెరగనున్నాయి. అంతర్జాతీయ కమోడిటీల ధరల్లో హెచ్చుతగ్గులు నమోదవుతుండడంతో దాని ప్రభావం భారత్‌పైనా పడింది. దీనికి తోడు ప్యాకేజింగ్ ధరలు కూడా పెరగడంతో నిత్యావసరాల ధరలు పెంచాలని ఎఫ్ఎంసీజీ కంపెనీలు నిర్ణయించాయి. హిందూస్థాన్ యూనిలివర్, నెస్లే వంటి కంపెనీలు ఇప్పటికే కొన్నింటి ధరలు పెంచగా, ఇప్పుడు కాఫీ, టీ పొడి, నూనె, గోధుమపిండి వంటివాటి ధరలు పెంచాలని మరికొన్ని కంపెనీలు నిర్ణయించాయి. 

మరోవైపు, రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం కూడా భారత్‌లో ధరల పెరగుదలకు కారణమవుతోంది. ఇటీవల కొంత తగ్గిన వంటనూనెల ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. ఈ నేపథ్యంలో తమపై పడుతున్న భారాన్ని వినియోగదారులపైకి నెట్టేయాలని కంపెనీలు భావిస్తున్నాయి. 

ఈ సందర్భంగా డాబర్ ఇండియా చీఫ్ ఫైనాన్షియల్ అధికారి అంకుష్ జైన్ మాట్లాడుతూ, ద్రవ్యోల్బణ భారానికి అనుగుణంగా ధరల పెంపుపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం తమ వద్ద ఒకటి రెండు నెలలకు సరిపడా మాత్రమే ముడిపదార్థాలు, ప్యాకేజింగ్ ఉత్పత్తులు ఉన్నాయని, కాబట్టి ధరల పెంపుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని పార్లే ప్రొడక్స్ సీనియర్ కేటగిరి అధికారి మయాంక్ షా తెలిపారు.

More Telugu News