Yogi Adityanath: యోగి ప్రమాణస్వీకారం.. మోదీ, అమిత్ షాలతో పాటు వీరిద్దరు కూడా హాజరయ్యే అవకాశం!

  • రెండోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న యోగి
  • ఈ నెల 25న యోగి ప్రమాణ స్వీకారం
  • అఖిలేశ్, ప్రియాంకలు హాజరయ్యే అవకాశం
Akhilesh and Priyanka may attend Yogi Adityanath Oath taking ceremony

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ వరుసగా రెండోసారి సీఎంగా బాధ్యతలను చేపట్టనున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో యోగి నేతృత్వంలో బీజేపీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈ నెల 25న యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. 

ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితర కీలక నేతలు హాజరవుతున్నారు. వీరితో పాటు పలువురు బీజేపీ కీలక నేతలు, కేంద్ర మంత్రులు, ఆరెస్సెస్ అధ్యక్షుడు మోహన్ భగవత్ హాజరవబోతున్నారు. 

మరోవైపు ప్రమాణస్వీకార కార్యక్రమానికి విపక్షాలకు చెందిన కీలక నేతలకు కూడా ఆహ్వానాలు వెళ్లాయి. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, జనరల్ సెక్రటరీ ప్రియాంకాగాంధీ, సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతిలను ఆహ్వానించారు. వీరిలో అఖిలేశ్ యాదవ్, ప్రియాంకాగాంధీలు ప్రమాణస్వీకారానికి హాజరయ్యే అవకాశం ఉందని చెపుతున్నారు.

More Telugu News