Iran: మధ్యవర్తులతో సంబంధం లేకుండా భారత్ ఇంధన అవసరాలు తీర్చేందుకు ఇరాన్ సంసిద్ధత

  • గతంలో ఇరాన్ నుంచి భారత్ కు చమురు
  • 2018లో ఇరాన్ తో అణుఒప్పందం నుంచి తప్పుకున్న అమెరికా
  • ఇరాన్ చమురు ఎగుమతులపై ట్రంప్ ఆంక్షలు
  • ఇటీవల కాలంలో ఆంక్షల ఎత్తివేతకు సంప్రదింపులు
  • భారత్ తో మళ్లీ ఒప్పందంపై ఇరాన్ రాయబారి వ్యాఖ్యలు
Iran ready to revive fuel imports deal with India

భారత్ 130 కోట్లకు పైగా జనాభాతో అలరారుతున్న పెద్ద దేశం. సహజంగానే ఇంధన అవసరాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. అందుకే భారత్ పలు దేశాల నుంచి భారీగా చమురు దిగుమతి చేసుకుంటోంది. 80 శాతం ఇంధన అవసరాలకు దిగుమతులపైనే ఆధారపడుతోంది. తాజాగా ఇరాన్ నుంచి భారత్ కు ఆసక్తికర ప్రతిపాదన అందింది. మధ్యవర్తులతో ప్రమేయం లేకుండా భారత్ కు నేరుగా భారీ ఎత్తున చమురును సరఫరా చేసేందుకు ఇరాన్ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ మేరకు భారత్ లోని ఇరాన్ రాయబారి వెల్లడించారు. 

గతంలో ఇరాన్... భారత్ కు రెండో అతిపెద్ద చమురు సరఫరాదారుగా ఉండేది. అయితే, 2018లో ఇరాన్ తో అణు ఒప్పందం నుంచి అమెరికా తప్పుకుంది. ఆ ఒప్పందం కాలం చెల్లినదంటూ నాటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు, ఇరాన్ తో ఎప్పటికైనా ప్రమాదమేనంటూ ఆ దేశ చమురు ఎగుమతులపైనా మళ్లీ భారీ ఆంక్షలు విధించారు. దాంతో ఇరాన్ నుంచి చమురు దిగుమతులను భారత్ అర్థాంతరంగా ఆపుకోవాల్సివచ్చింది.  

చమురు ఎగుమతి దేశాల కూటమి ఒపెక్ సభ్యురాలైన ఇరాన్ పై ఆంక్షల ఎత్తివేత అంశంపై కొన్నాళ్లుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇరాన్... భారత్ ముందు తాజా ప్రతిపాదన ఉంచింది. 

దీనిపై ఇరాన్ రాయబారి అలీ చెంజెనీ స్పందిస్తూ, "భారత రూపాయి, ఇరాన్ రియాల్ మరింత వృద్ధి చెందేలా ఒప్పందం కుదుర్చుకోవాలని అనుకుంటున్నాం. తద్వారా ఇరుదేశాల కంపెనీలు ఎంతో లాభపడతాయి. ఇందులో మధ్యవర్తిత్వానికి అయ్యే అధిక ఖర్చులను నిరోధించేందుకు వీలుగా ఇరుదేశాలు నేరుగా మాట్లాడుకుని ఒప్పందం కుదుర్చుకోవచ్చు. అదే జరిగితే ద్వైపాక్షిక వాణిజ్యం విలువ 30 బిలియన్ డాలర్లకు ఎగబాకుతుంది" అని తెలిపారు.

More Telugu News