Samsung: క్షమాపణ కోరిన శాంసంగ్, వన్ ప్లస్

  • యాప్ ల పనితీరు మందగించేలా ‘యాప్ థ్రాట్లింగ్’
  • గేమింగ్, బ్యాటరీ లైఫ్ ను పెంచేందుకు వ్యూహం
  • శాంసంగ్ లో 10 వేలకు పైగా యాప్ లు స్లో
  • యూజర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత
  • సమస్యకు పరిష్కారాలు చూస్తున్నామన్న సంస్థలు
Samsung and One Plus Apologised For Alleged APP Throttling

ఫోన్లలో ‘యాప్ థ్రాట్లింగ్’పై శాంసంగ్, వన్ ప్లస్ సంస్థలు క్షమాపణ కోరాయి. ఫోన్లలో గేమింగ్ పెర్ఫార్మెన్స్ పెంచడం కోసం సంస్థలు ప్లే స్టోర్ లోనే వివిధ యాప్ ల పనితీరు సామర్థ్యాన్ని తగ్గించేస్తున్నాయి. తద్వారా బ్యాటరీ లైఫ్ ను పెంచడంతో పాటు గేమ్ లకు అనువుగా సాఫ్ట్ వేర్ ను మరింత శక్తిమంతంగా మారుస్తున్నాయి. 

ప్రస్తుతం శాంసంగ్  గెలాక్సీ ఎస్ 22తో పాటు గెలాక్సీ ట్యాబ్ ఎస్ 8 సిరీస్ లోనూ యాప్ లు బాగా స్లో అయ్యాయి. వాటి పనితీరు మందగించింది. దీంతో ఆ సంస్థ చీఫ్ స్వయంగా క్షమాపణ అడిగారు. ఇప్పటికే గూగుల్, క్రోమ్, వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, నెట్ ఫ్లిక్స్, జూమ్ వంటి 10 వేల యాప్ లను ‘యాప్ థ్రాట్లింగ్’ జాబితాలో శాంసంగ్ చేర్చినట్టు తెలుస్తోంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్ 22లో గేమ్ ఆప్టిమైజేషన్ సాఫ్ట్ వేర్ ఇన్ బిల్ట్ గా వస్తోంది. ఈ నేపథ్యంలోనే 10 వేలకు పైగా యాప్ ల పనితీరు మందగించేలా చేస్తున్నట్టు తెలుస్తోంది. 

ఈ సమస్య నుంచి బయటపడేందుకు త్వరలోనే సాఫ్ట్ వేర్ అప్ డేట్ తీసుకొస్తున్నామని, గేమ్ లాంచర్ యాప్ లో గేమ్ బూస్టర్ ల్యాబ్ అనే ఆప్షన్ ను తీసుకొస్తున్నట్టు శాంసంగ్ తెలిపింది. 

ఇటు వన్ ప్లస్ 9, వన్ ప్లస్ 9 ప్రో ఫోన్లలోనూ అదే సమస్య వేధిస్తోంది. అప్లికేషన్ డిటెక్షన్ మెకానిజం అనే వ్యవస్థ ద్వారా యాప్ ల పనితీరును నెమ్మది చేసినట్టు చెబుతున్నారు. అయితే, తాము బ్యాటరీ లైఫ్ ను పెంచేందుకు, ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు వీలుగానే యాప్ థ్రాట్లింగ్ ను చేశామని పేర్కొన్న సంస్థ.. వినియోగదారులకు సారీ చెప్పింది. ఈ సమస్యకు పరిష్కారంగా ఆక్సిజన్ ఓఎస్ 12ఓ ‘ఆప్టిమైజ్డ్ మోడ్’ను తీసుకొస్తున్నామని ప్రకటించింది. 

ఈ నేపథ్యంలోనే ప్రముఖ సైట్లు శాంసంగ్ గెలాక్సీ సిరీస్ ఫోన్లను విక్రయాల నుంచి తప్పించాయి. వినియోగదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో శాంసంగ్ క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది.

More Telugu News