Telangana: ముగిసిన బ‌డ్జెట్ స‌మావేశాలు.. తెలంగాణ అసెంబ్లీ నిరవ‌ధిక వాయిదా

  • 55 గంట‌ల పాటు సాగిన అసెంబ్లీ
  • 12 గంట‌ల పాటు కొన‌సాగిన మండ‌లి
  • విప‌క్షాల‌కు ఎక్కువ స‌మ‌య‌మే ఇచ్చామ‌న్న ప్ర‌శాంత్ రెడ్డి
Indefinite adjournment of Telangana Assembly

తెలంగాణ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు మంగ‌ళ‌వారంతో ముగిశాయి. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం నాడు శాస‌న స‌భ‌ను నిర‌వ‌ధికంగా వాయిదా వేస్తున్న‌ట్లు స్పీక‌ర్ పోచారం శ్రీనివాస‌రెడ్డి ప్ర‌క‌టించారు. ఆఖరి రోజు సభలో ప్రసంగించిన సీఎం కేసీఆర్.. ఫీల్డ్‌ అసిస్టెంట్లు, సెర్ఫ్‌, మెప్మా ఉద్యోగులకు తీపి కబురు చెప్పారు. ఉక్రెయిన్‌ నుంచి తిరిగొచ్చిన విద్యార్థులనూ ఆదుకుంటామని హామీ ఇచ్చారు. 

బ‌డ్జెట్ స‌మావేశాలు ముగిసిన‌ నేపథ్యంలో మంత్రి ప్రశాంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాలు అర్థవంతంగా సాగాయన్నారు. శాసన సభ 54 గంటల 55 నిమిషాలు సాగిందని, మండలి 12 గంటలు సాగిందని ఆయన వెల్లడించారు. సీఎం కేసీఆర్ ద్వారా కొన్ని ముఖ్య ప్రకటనలు వచ్చాయని, తక్కువ రోజులు ఎక్కువ సమయం సమావేశాలు సాగాయన్నారు. ప్రజాధనం వృథా కావడం కేసీఆర్ కు ఇష్టం ఉండదని, స‌మావేశాల‌ను తక్కువ‌ రోజులే జరిపినా ఎక్కవ సమయం నడిపామన్నారు.

కనీసం 8 గంటలు.. ఒక్కోరోజు 12 గంటలు కూడా స‌భ‌ సాగిందని ప్ర‌శాంత్ రెడ్డి వెల్ల‌డించారు. భట్టి విక్రమార్క ప్రతి పక్షంలో ఉన్నారు కాబట్టి మాట్లాడాలి అని మాట్లాడుతున్నారని.. వాళ్లకు ఎక్కువ సమయం ఇచ్చామన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నది 6 మంది.. కానీ ఇద్దరు ముగ్గురే ఉన్నారన్నారు. విప‌క్షాలు అడిగిన‌ అన్నింటికీ సమాధానాలు ఇచ్చామని, సీఎం కేసీఆర్ ప్రతిపక్ష ఫ్లోర్ లీడర్ లకు అవకాశం ఇచ్చారని ఆయన తెలిపారు.

More Telugu News