IYR Krishna Rao: నవరత్నాల్లో ఒక రత్నాన్ని విస్మరించారు.. ఆదాయం విపరీతంగా పెరుగుతోంది: ఐవైఆర్ కృష్ణారావు

IYR Krishna Rao opines on AP Budget
  • నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏపీ మంత్రి బుగ్గన
  • విమర్శనాత్మకంగా స్పందించిన ఐవైఆర్
  • జగన్ ను రెడ్డిరాజులతో పోల్చితే బాగుండేదని వ్యంగ్యం
  • బుగ్గన తిరుక్కురాళ్ ప్రస్తావనపై విమర్శలు
  • బడ్జెట్ తీరుతెన్నులపై సునిశిత విశ్లేషణ

ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నిన్న అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టడంపై బీజేపీ నేత, మాజీ ఐఏఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు స్పందించారు. తిరువళ్లువార్ రచించిన తిరుక్కురాళ్ గొప్ప గ్రంథం అని, చిదంబరం నుంచి నిర్మలా సీతారామన్ వరకు బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో తిరుక్కురాళ్ లోని అంశాలను ప్రస్తావించారని ఐవైఆర్ వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా తిరుక్కురాళ్ నుంచి ప్రస్తావిస్తుంటారని తెలిపారు. 

అయితే, ఏపీ మంత్రి బుగ్గన కూడా రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు తిరుక్కురాళ్ లోని అంశాలను ఉదహరించారని తెలిపారు. సుమతీ శతకం, వేమన శతకం, తిక్కన భారతం, పోతన భాగవతం, ఇతర తెలుగు గ్రంథాల నుంచి ప్రస్తావించకుండా, బుగ్గన తిరుక్కురాళ్ నుంచి ప్రస్తావించాల్సిన ప్రత్యేక అవసరం ఏంటో అర్థంకావడంలేదని పేర్కొన్నారు. ఒకవేళ సీఎం జగన్ ను పొగడడమే లక్ష్యం అయితే రాజరాజనరేంద్రుడు, శ్రీకృష్ణదేవరాయలు, కొండవీటి రెడ్డిరాజుల వరకు ఎంతోమంది ఉన్నారని, వారితో పోల్చితే సరిపోయేదని ఐవైఆర్ వ్యంగ్యం ప్రదర్శించారు. 

ఇక బడ్జెట్ లోని అంశాలపై స్పందిస్తూ... పద్దుల అంశం పరిశీలిస్తే, పరిమితిలేని అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాళా దిశగా నడిపిస్తున్నట్టే ఉందని అభిప్రాయపడ్డారు. ఈ మధ్య విడుదలైన కాగ్ లెక్కల ప్రకారం 2021-22లో 9 నెలలకు రెవెన్యూ లోటు రూ.45,900 కోట్లు అని తెలిపారు. కానీ ఈ బడ్జెట్లో రెవెన్యూ లోటును రూ.19,545 కోట్లుగా చూపించారని ఐవైఆర్ ఆరోపించారు. 

మిగిలిన 3 నెలలతో కలిపి ఈ రెవెన్యూ లోటు రూ.45,900 కోట్ల కన్నా ఎక్కువ ఉండాలి కానీ తక్కువ కాదు అని అభిప్రాయపడ్డారు. మిగిలిన మూడు నెలల్లో చెల్లింపులు చేయకుండా ఖర్చులు తగ్గించి చూపారని అర్థమవుతోందని తెలిపారు. తద్వారా మసిపూసి మారేడుకాయ చేసి కృత్రిమంగా రెవెన్యూ లోటును తగ్గించారని విమర్శించారు. దీని ప్రభావం 2022-23 ఆర్థిక సంవత్సరంలో కనిపిస్తాయని హెచ్చరించారు. 

కేంద్రం నుంచి వచ్చే గ్రాంటులను 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.56,000 కోట్లుగా చూపారని, అయితే 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఇదే పద్దు కింద రూ.57,930 కోట్లు చూపితే... సవరించిన అంచనాల ప్రకారం వచ్చింది రూ.43,632 కోట్లు అని ఐవైఆర్ వివరించారు. ఆ లెక్కన రూ.14 వేల కోట్లు తగ్గిందని స్పష్టం చేశారు. బడ్జెట్ ను బ్యాలెన్స్ చేసుకోవడానికి తప్పితే వాస్తవానికి ఇంతమొత్తంలో కేంద్రం నుంచి గ్రాంటులు వచ్చే అవకాశమే లేదని ఉద్ఘాటించారు. 

కరోనా వల్ల ఆదాయం తగ్గి అప్పులు చేయాల్సి వచ్చిందని ఆర్థికమంత్రి ఓ సందర్భంలో అన్నారని, కానీ గవర్నర్ ప్రసంగంలో రాష్ట్ర ఆదాయంపై కరోనా ప్రభావం లేదన్నారని ఆరోపించారు. అంతేకాకుండా, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న బడ్జెటేతర అప్పుల వివరాలు ఇవ్వాలని కాగ్ 2021లో రాసిన లేఖకు ఇంతవరకు ప్రభుత్వం నుంచి సమాధానం లేదని ఐవైఆర్ ఆరోపించారు. 

పొరుగు రాష్ట్రం తెలంగాణలో 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఆఫ్ బడ్జెట్ రుణాలు రూ.45 వేల కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోందని పేర్కొన్నారు. కానీ ఈ అంశాన్ని ఏపీ ప్రభుత్వం కాగ్ కు కూడా ఇవ్వకుండా ఇంత రహస్యంగా ఉంచింది అంటే, ఏ స్థాయిలో బడ్జెట్ వెలుపల అప్పులు చేసిందో అర్థం చేసుకోవచ్చని విశ్లేషించారు. 

గత మూడు సంవత్సరాల బడ్జెట్లను పరిశీలిస్తే.... అప్పులు చెయ్యి, పంచు అనే పద్ధతిలోనే కనిపిస్తున్నాయని, ముందస్తు ఎన్నికల ద్వారా అదృష్టం కలిసొచ్చి మళ్లీ అధికారంలోకి వస్తే ఈ ప్రజాకర్షక పథకాలను బంద్ చేసే అజెండా కనిపిస్తోందని ఐవైఆర్ ట్విట్టర్ లో వివరించారు. ఇప్పటికే నవరత్నాల్లోని ఒక రత్నాన్ని విస్మరించడం ద్వారా మద్యం ఆదాయం విపరీతంగా పెరుగుతోందని ఉదహరించారు.

  • Loading...

More Telugu News