EPFO: పీఎఫ్ వడ్డీ రేట్లలో భారీ కోత.. 40 ఏళ్ల కనిష్ఠానికి తగ్గించి షాకిచ్చిన ఈపీఎఫ్ వో

  • 8.5 శాతం నుంచి 8.1 శాతానికి కుదింపు
  • 6 కోట్ల మంది పీఎఫ్ చందాదారులపై ప్రభావం
  • ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకునే నిర్ణయమన్న సీబీటీ మెంబర్లు
EPFO Cuts Interest Rates By Huge Difference

ఉద్యోగ భవిష్య నిధి (ఈపీఎఫ్) వడ్డీ రేట్లను ఈపీఎఫ్ వో భారీగా తగ్గించి చందాదారులకు షాకిచ్చింది. 40 ఏళ్ల కనిష్ఠానికి వడ్డీ రేట్లను తగ్గించింది. 2021–22కిగానూ 8.1 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అంతకుముందు అది 8.5 శాతంగా ఉంది. తగ్గింపు నిర్ణయం వల్ల దాదాపు 6 కోట్ల మంది పీఎఫ్ చందాదారులపై ప్రభావం పడనుంది. సంస్థ ఆదాయం రూ.76,768 కోట్లుగా ఉందని, దానిని దృష్టిలో పెట్టుకునే వడ్డీ రేట్లను తగ్గించాల్సి వచ్చిందని ఈపీఎఫ్ సెంట్రల్ బోర్డ్ మెంబర్ మైకేల్ డయాస్ చెప్పారు. 

కార్పస్ ఫండ్ ఆదాయం 13 శాతం పెరిగిందని, కానీ, ఆదాయంపై వడ్డీ మాత్రం 8 శాతమే ఉందని మరో సభ్యుడు కేఈ రఘునందన్ చెప్పారు. 8.1 శాతం వడ్డీ చెల్లించాక ఈపీఎఫ్ వద్ద మిగులు రూ.450 కోట్లు ఉంటుందని తెలిపారు. 

కాగా, 1977–78 తర్వాత ఇంత తక్కువగా వడ్డీని చెల్లించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఆ ఏడాది పీఎఫ్ పై 8 శాతం వడ్డీని చెల్లించారు. 2018–19, 2016–17లలో 8.65 శాతం చొప్పున వడ్డీని జమ చేశారు. 2013–14, 2014–15లో 8.75 శాతం, 2015–16లో 8.8 శాతం చొప్పున చెల్లించారు. కరోనా సమయంలో నగదు ఉప సంహరణలు పెరగడంతో, చందాదారుల నుంచి జమయ్యే సొమ్ము తగ్గడంతో 2019–2020కిగానూ 8.5 శాతానికి తగ్గించారు. గత ఆర్థిక సంవత్సరం కూడా అంతే వడ్డీని ఇచ్చారు. ఇప్పుడు మరింత కోత విధించారు.

More Telugu News