Gorati Venkanna: కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు అందుకున్న గోర‌టి వెంక‌న్న‌

  • వ‌ల్లంకి తాళం క‌వితా సంపుటికి అవార్డు
  • 2020-21 ఏడాదికి అవార్డు ప్ర‌క‌ట‌న‌
  • ఢిల్లీలో అవార్డును అందుకున్న గోర‌టి
gorati venkanna recieves sahitya acacemt award

ప్ర‌ముఖ కవి, గాయకుడు‌, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ గోర‌టి వెంక‌న్న త‌న‌కు కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డును శుక్ర‌వారం అందుకున్నారు. ఢిల్లీలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో కేంద్ర సాహిత్య అకాడెమీ చైర్మ‌న్ చంద్ర‌శేఖర్ చేతుల మీదుగా గోర‌టి వెంక‌న్న ఈ అవార్డును స్వీకరించారు.

ప‌ల్లె ప‌దాల‌తో, ప‌ల్లె పాట‌ల‌తో త‌న‌దైన శైలిలో సాగించిన‌ ర‌చ‌న‌ల‌తో గోర‌టి వెంక‌న్న‌ తెలుగు నేల‌లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ప్ర‌త్యేకించి పేద‌ల ఇళ్ల‌లోని అసౌక‌ర్యాలు, బ‌డుగుల‌పై భూస్వాముల దౌర్జ‌న్యాల‌ను క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు పాట‌లు ర‌చించ‌డ‌మే కాకుండా వాటిని త‌న గొంతుక‌తోనే పాడే వెంక‌న్న తెలంగాణ ఉద్య‌మంలోనూ కీల‌క భూమిక పోషించారు. 

ఉమ్మ‌డి మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా, ప్ర‌స్తుతం నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా గౌరారంలో 1963లో జ‌న్మించిన వెంక‌న్న‌.. వ‌ల్లంకి తాళం పేరిట చేసిన క‌వితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డుకు ఎంపికైన సంగతి తెలిసిందే. 2020-21 ఏడాదికి గాను ప్ర‌క‌టించిన ఈ అవార్డును వెంక‌న్న శుక్ర‌వారం అందుకున్నారు.

ఇదిలా ఉంటే.. కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు అందుకోవ‌డానికి శుక్ర‌వారం నాడు ఢిల్లీ వెళ్లిన గోర‌టి వెంక‌న్న సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌తోనూ భేటీ అయ్యారు. జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ అధికారిక నివాసానికి వెళ్లిన వెంక‌న్న న్యాయ‌మూర్తిని మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు.

More Telugu News