BJP: గోవాలో బీజేపీ ప్ర‌భుత్వ‌మే.. మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన ఇండిపెండెంట్‌

  • బిచోలిమ్ నుంచి ఇండిపెండెంట్‌గా చంద్ర‌కాంత్
  • ఎన్నిక‌ల్లో గెలిచినంత‌నే బీజేపీకి మ‌ద్ద‌తు ప్ర‌క‌ట‌న‌
  • ఈ కంటి డాక్ట‌ర్ మ‌ద్దతుతో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ
independent mla Chandrakant Shetye declares support to BJP

గోవాలో బీజేపీ ప్ర‌భుత్వ ఏర్పాటుకు మార్గం సుగ‌మం అయిపోయింది. 40 సీట్లున్న గోవా అసెంబ్లీకి జ‌రిగిన ఎన్నిక‌ల్లో 21 సీట్లలో విజ‌యం సాధిస్తే ఆ పార్టీ పూర్తి మెజారిటీ సాధించినట్లే. అయితే గురువారం విడుద‌లైన ఫ‌లితాల్లో 20 సీట్ల‌లో విజ‌యం సాధించిన బీజేపీ.. స్పష్టమైన మెజారిటీకి కేవ‌లం ఒక్క అడుగు దూరంలోనే నిలిచింది. 

ఇక మిగిలిన సీట్ల‌లో 12 సీట్ల‌ను కాంగ్రెస్ గెలుచుకోగా.. ఆప్‌, తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీలు చెరో రెండు సీట్ల‌ను గెలుచుకున్నాయి. స్వతంత్రులు ఏకంగా నాలుగు సీట్ల‌లో విజ‌యం సాధించారు. అంటే.. ఆప్‌, తృణ‌మూల్ పార్టీ విన్న‌ర్ల‌తో పాటు గెలిచిన న‌లుగురు స్వ‌తంత్రులు కూడా కాంగ్రెస్ పార్టీకి మ‌ద్ద‌తిచ్చినా.. ఆ పార్టీకి మెజారిటీ ద‌క్కే అవ‌కాశ‌మే లేదు.

ఈ క్రమంలో ఓ స్వ‌తంత్ర అభ్య‌ర్థి తాను గెలిచిన వెంట‌నే త‌న మ‌ద్ద‌తును బీజేపీకి ప్ర‌క‌టించారు. గోవా ఎన్నిక‌ల్లో బిచోలిమ్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన ప్రముఖ కంటివైద్య నిపుణుడు డా. చంద్ర‌కాంత్ షెత్యే గురువారం నాటి ఫ‌లితాల్లో విజ‌యం సాధించారు.

 ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన మ‌రుక్ష‌ణ‌మే మీడియా ముందుకు వ‌చ్చిన చంద్ర‌కాంత్ తాను బీజేపీకి మద్ద‌తు ప‌లుకుతున్న‌ట్లుగా ప్ర‌క‌టించారు. అప్ప‌టికే 20 సీట్లు గెలుచుకున్న బీజేపీ.. చంద్ర‌కాంత్ మద్ద‌తుతో సంపూర్ణ మెజారిటీ సాధించిన‌ట్టే. దీంతో మ‌రోమారు గోవాలో బీజేపీ ప్ర‌భుత్వ‌మే ప‌రిపాలన సాగించ‌నుంది.

  • Loading...

More Telugu News