Nirmal District: రేకుల షెడ్డుకు రూ. 21 కోట్ల కరెంట్ బిల్లు.. బిత్తరపోయిన నిర్మల్ జిల్లా వాసి!

  • ప్రతి నెల రూ. 300 నుంచి 400 మధ్య వచ్చే బిల్లు
  • సాంకేతిక లోపం కారణంగా కోట్ల రూపాయల బిల్లు
  • మరోసారి రీడింగ్ తీయించి ఇచ్చిన అధికారులు
Telangana man gets Rs 21 cr current bill

తెలంగాణ నిర్మల్ జిల్లాలోని సారంగాపూర్ లో నివసిస్తున్న వడ్ల అవుజయ్య తనకు వచ్చిన కరెంట్ బిల్లును చూసుకుని షాక్ కు గురయ్యాడు. అవుజయ్యది పేద కుటుంబం. పెచ్చులూడిపోయే గోడలున్న ఒక రేకుల షెడ్డులో నివసిస్తున్నాడు. ఇంట్లో ఒక ఫ్యాన్, ఒక టీవీ, రెండు బల్బులు మాత్రమే ఉన్నాయి. ప్రతి నెలా కరెంట్ బిల్లు రూ. 300 - 400 మధ్య వస్తుంటుంది. కరెంట్ బిల్లు తీసే వ్యక్తి నిన్న వచ్చి మీటర్ స్కాన్ చేసి బిల్లు ఇచ్చి వెళ్లిపోయాడు. 

ప్రతి నెల మాదిరే బిల్లు వచ్చి ఉంటుందని భావించిన అవుజయ్య కళ్లు బైర్లు కమ్మాయి. ఏకంగా రూ. 21,47,48,364 బిల్లు వచ్చింది. కాసేపటి తర్వాత కోలుకున్న ఆయన కరెంట్ అధికారుల వద్దకు పరుగులు తీశాడు. తొలుత షాక్ కు గురైన అధికారులు ఆ తర్వాత సాంకేతిక లోపంతో ఇది జరిగి ఉంటుందని గుర్తించారు. అనంతరం మరోసారి బిల్లు తీయించి ఇచ్చారు. ఈ సారి బిల్లు ఎప్పటి మాదిరే ఉండటంతో అవుజయ్య ఊపిరి పీల్చుకున్నాడు.

More Telugu News