Andhra Pradesh: అప్పుడే మొదలైన భానుడి భగభగలు.. ఏపీలో 39 డిగ్రీలకు చేరిన గరిష్ఠ ఉష్ణోగ్రతలు

  • రాష్ట్రంలో గరిష్ఠంగా 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
  • రాత్రి 8 గంటలైనా తగ్గని వేడి
  • కడపలో ఈ నెల 14, 15వ తేదీల్లో 42 డిగ్రీల ఉష్ణోగ్రత!
Temperatures in Andhrapradesh Gradually increasing

ఆంధ్రప్రదేశ్‌లో వేసవి సెగ మొదలైంది. ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. రాయలసీమలో ఉదయం ఏడు గంటల నుంచే వేడి మొదలవుతుండగా, రాత్రి 8 గంటలైనా అది తగ్గడం లేదు. రాష్ట్రంలో గరిష్ఠంగా 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో 34 డిగ్రీల వరకు నమోదవుతోంది. గత రెండుమూడు రోజులుగా సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ వారంలో అవి మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.

ఉత్తర కోస్తాలో మాత్రం సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాల్లో ఉష్ణోగ్రతల ప్రభావం అధికంగా ఉంటుందని తెలిపింది. అలాగే, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సాధారణంగా, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. 

కడపలో ప్రస్తుతం సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నప్పటికీ ఈ నెల 14, 15 తేదీల్లో 42 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ నెల 15న విజయవాడలో 43.1 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని, అమరావతి, ఏలూరు, గుంటూరు ప్రాంతాల్లో ఎండలు మరింత ముదురుతాయని కేఎల్ యూనివర్సిటీలోని వాతావరణ విభాగం అంచనా వేసింది. తిరుపతి, నెల్లూరు, అనంతపురం, ఒంగోలు తదితర ప్రాంతాల్లో 33 డిగ్రీల నుంచి 38.3 డిగ్రీల మధ్య నమోదవుతాయని అంచనా వేసింది.

More Telugu News