Sonakshi Sinha: నా ప్రతిష్ఠను దెబ్బతీసే కుట్ర అది..: సోనాక్షి సిన్హా

  • నాన్ బెయిలబుల్ వారంట్ జారీ కాలేదన్న సోనాక్షి  
  • తన నుంచి డబ్బు రాబట్టే ప్రయత్నమని ఫైర్  
  • ప్రచారం కోసం ఓ వ్యక్తి ఆడుతున్న ఆట అంటూ వ్యాఖ్య 
  • ఈ అంశం కోర్టు పరిధిలో ఉందన్న సోనాక్షి 
Sonakshi Sinha calls reports of non bailable warrant against her fake in statement

తనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయినట్టు వచ్చిన కథనాలను బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా ఖండించారు. ఢిల్లీలో ఒక కార్యక్రమానికి హాజరయ్యేందుకు రూ.37 లక్షలు తీసుకుని, హాజరు కాకపోగా, ఆ మొత్తాన్ని తిరిగి ఇవ్వకపోవడంతో ఆమెపై మోసం కేసు దాఖలైనట్టు రెండు రోజుల క్రితం వార్తలు వెలుగు చూడడం తెలిసిందే. దీనిపై సోనాక్షి సిన్హా తాజాగా స్పందించింది.


‘‘నాకు వ్యతిరేకంగా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయిందంటూ మీడియాలో వచ్చిన వార్తల్లో నిజం లేదు. ఈ అంశంలో నా వివరణ తీసుకోలేదు. ఇది పూర్తిగా కల్పితం. ఒక వ్యక్తి నన్ను వేధించేందుకు కుట్ర చేస్తున్నారు. అన్ని మీడియా హౌస్ లు, జర్నలిస్టులకు నా వినతి ఏమిటంటే.. ఈ కల్పిత వార్తను ప్రసారం చేయవద్దు. ఒకరి వ్యక్తిగత అజెండాకు వేదిక కల్పించొద్దు. సదరు వ్యక్తి ప్రచారం కోసం, నా నుంచి డబ్బును రాబట్టేందుకు.. ఎన్నో ఏళ్లుగా నేను సంపాదించుకున్న ప్రతిష్ఠపైనే దాడి చేస్తున్నాడు.

ఈ అంశం మురాదాబాద్ కోర్టు పరిధిలో ఉంది. దీనిపై అలహాబాద్ హైకోర్టు స్టే కూడా ఇచ్చింది. కోర్టు ధిక్కారం కింద సదరు వ్యక్తిపై నా న్యాయ బృందం చర్యలు తీసుకుంటుంది. మురాదాబాద్ కోర్టు తీర్పు ఇచ్చే వరకు ఈ అంశంపై నా వివరణ ఇదే’’ అంటూ సోనాక్షి సిన్హా తెలిపారు.

More Telugu News