IPL-2022: ఐపీఎల్-2022 షెడ్యూల్ ప్రకటించిన బీసీసీఐ... వివరాలు ఇవిగో!

  • మార్చి 26 నుంచి ఐపీఎల్
  • మొత్తం 65 రోజుల పాటు పోటీలు
  • 70 లీగ్ మ్యాచ్ లు, 4 ప్లేఆఫ్ లు
  • మే 29న ఫైనల్
  • నాలుగు మైదానాల్లోనే మొత్తం మ్యాచ్ లు
  • ముంబయి, పూణే నగరాల్లో టోర్నీ
BCCI announced IPL latest season schedule

మరో మూడు వారాల్లో ఐపీఎల్ 15వ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో బీసీసీఐ టోర్నీ షెడ్యూల్ ప్రకటించింది. ఐపీఎల్-2022 మార్చి 26న ప్రారంభం కానుంది. ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ కు ముంబయిలోని వాంఖెడే స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. ఈ మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి.  

ఈసారి ఐపీఎల్ ను భారత్ లోనే నిర్వహిస్తున్నప్పటికీ, కరోనా పరిస్థితుల నేపథ్యంలో కేవలం రెండు నగరాల్లోనే మ్యాచ్ లు జరగనున్నాయి. ముంబయిలో మూడు స్టేడియాలు, పూణేలో ఒక స్టేడియంలో ఐపీఎల్ తాజా సీజన్ నిర్వహించనున్నారు. ఐపీఎల్-15లో మొత్తం 70 లీగ్ మ్యాచ్ లు, 4 ప్లే ఆఫ్ మ్యాచ్ లు ఉంటాయి. పోటీలు 65 రోజుల పాటు జరగనున్నాయి. 

ముంబయి వాంఖెడే స్టేడియంలో 20, డీవై పాటిల్ స్టేడియంలో 20 మ్యాచ్ లు, బ్రాబౌర్న్ స్టేడియంలో 15, పూణే ఎంసీఏ మైదానంలో 15 మ్యాచ్ లు నిర్వహిస్తారు. ఈసారి 12 డబుల్ హెడర్లు (ఒక రోజులో రెండు మ్యాచ్ లు) ఉంటాయి. డబుల్ హెడర్ లో తొలి మ్యాచ్ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం అయితే, రెండో మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం అవుతుంది. ఇక, టోర్నీ ఫైనల్ మే 29న జరగనుంది.

More Telugu News