NV Ramana: తిరుమలలో సీజేఐ ఎన్వీ రమణకు ఘనస్వాగతం

  • తిరుమల విచ్చేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
  • పద్మావతి అతిథి గృహం వద్ద స్వాగతం పలికిన వైవీ తదితరులు
  • వివిధ స్టాళ్లను తిలకించిన ఎన్వీ రమణ
  • రేపు ఉదయం శ్రీవారి దర్శనం
Grand welcome for CJI NV Ramana in Tirumala

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కుటుంబసమేతంగా తిరుమల విచ్చేశారు. పద్మావతి అతిథి గృహం వద్ద సీజేఐ ఎన్వీ రమణకు ఘనస్వాగతం లభించింది. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి... జస్టిస్ ఎన్వీ రమణకు శాలువా కప్పి సత్కరించారు. సీజేఐకి స్వాగతం పలికినవారిలో వైసీపీ శాసనసభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి, టీటీడీ ఈవో కేఎస్ జవహర్, టీటీడీ అడిషనల్ ఈవో ధర్మారెడ్డి తదితరులు ఉన్నారు. 

జస్టిస్ ఎన్వీ రమణ రాక నేపథ్యంలో పద్మావతి అతిథి గృహంలో పంచగవ్య ఉత్పత్తుల ప్రదర్శన ఏర్పాటు చేశారు. వైఎస్సార్ హార్టికల్చర్ యూనివర్సిటీ సౌజన్యంతో టీటీడీ డ్రై ఫ్లవర్ సాంకేతికతతో రూపొందించిన తిరుమల వెంకన్న ఫొటోలు, పేపర్ వెయిట్లు, కీచైన్లతో ప్రత్యేక స్టాల్ ను కూడా ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనను ఎన్వీ రమణ తిలకించారు. 

కాగా, ఇవాళ మధ్యాహ్నం జస్టిస్ ఎన్వీ రమణ తిరుచానూరులో పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆపై తిరుపతి అలిపిరి వద్ద సప్త గో ప్రదక్షిణ శాలను సందర్శించడమే కాకుండా, గో తులాభారం చెల్లించారు. జస్టిస్ ఎన్వీ రమణ రేపు ఉదయం శ్రీవారి దర్శనం చేసుకోనున్నారు.

More Telugu News