కేసీఆర్ కు పీకే ఉంటే, మాకు 40 లక్షల మంది ఏకే-47 లాంటి కార్యకర్తలున్నారు: రేవంత్ రెడ్డి

Revanth Reddy talks about Congress digital memberships
  • డిజిటల్ సభ్యత్వాల నమోదులో కాంగ్రెస్ జోరు
  • 40 లక్షల సభ్యత్వాలతో కాంగ్రెస్ నెంబర్ వన్ అన్న రేవంత్ 
  • కాంగ్రెస్ నేతలు పరిస్థితిని సద్వినియోగం చేసుకోవాలని సూచన
ఇటీవల తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వాల నమోదు ముమ్మరం చేసింది. భారీగా సభ్యత్వాలు నమోదు చేయించే కార్యకర్తలను కాంగ్రెస్ అగ్రనేతలు ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ వారిని మరింత ప్రోత్సహిస్తున్నారు. కాగా, కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వాల జోరు చూసి కేసీఆర్ భయపడుతున్నాడని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. అందుకే ప్రశాంత్ కిశోర్ (పీకే)ను తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కు పీకే ఉంటే, కాంగ్రెస్ పార్టీకి 40 లక్షల మంది ఏకే-47 వంటి కార్యకర్తలు ఉన్నారని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

ప్రజలు కాంగ్రెస్ పక్షాన ఉన్నారని, కాంగ్రెస్ నేతలు ఈ పరిస్థితులను సద్వినియోగపరుచుకోవాలని పిలుపునిచ్చారు. 40 లక్షల డిజిటల్ సభ్యత్వాలతో కాంగ్రెస్ పార్టీ దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచిందని అన్నారు. అంతేకాదు, ఆ 40 లక్షల మంది అదనంగా ఒక్కో ఓటు తీసుకువచ్చినా చాలు 80 లక్షల ఓట్లు లభిస్తాయని ధీమాగా చెప్పారు. కాగా, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం పొందినవారికి రూ.2 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తున్నామని రేవంత్ వెల్లడించారు.
Go Back to Shorts
Revanth Reddy
Congress
Digital Membership
Telangana
India

More Telugu News