KTR: విద్యార్థుల త‌ర‌లింపులోనూ సొంత డ‌బ్బానేనా?: కేంద్రంపై కేటీఆర్ ఫైర్‌

  • ఉక్రెయిన్ నుంచి భారత‌‌ విద్యార్థుల త‌ర‌లింపున‌కు ఆప‌రేష‌న్ గంగ‌
  • మోదీ ద‌య వ‌ల్లే ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డార‌న్న కేంద్ర మంత్రి
  • అదే వీడియోను పోస్ట్ చేసిన కేటీఆర్‌
  • విద్యార్థుల త‌ర‌లింపులో కూడా ప్ర‌చార యావ ఎందుక‌ని ప్ర‌శ్న‌
ktr fires on modi gevernment

ర‌ష్యాతో యుద్ధం కార‌ణంగా ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భార‌త విద్యార్థుల త‌ర‌లింపు కోసం కేంద్ర ప్ర‌భుత్వం ఆప‌రేష‌న్ గంగ పేరిట ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. గ‌డ‌చిన వారం రోజులుగా నిర్విరామంగా సాగుతున్న ఈ ఆప‌రేష‌న్‌లో ఉక్రెయిన్‌లో చిక్కుబ‌డిపోయిన భార‌తీయులంద‌రినీ దాదాపుగా స్వ‌దేశానికి త‌ర‌లించేసిన‌ట్టే. ఇంకా కొంత మంది ఉన్నట్లుగా వార్త‌లు వ‌స్తున్నా.. వారిని కూడా దేశానికి త‌ర‌లించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ఏకంగా ఎయిర్ ఫోర్స్ విమానాల‌ను వినియోగిస్తోంది. 

ఇదంతా బాగానే ఉన్నా..విద్యార్థుల త‌ర‌లింపును కూడా కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం త‌మ‌కు అనుకూలంగా ఓ ప్ర‌చారాస్త్రంగా వాడుకుంటోంద‌ని ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. ఇదే అంశాన్ని ప్ర‌స్తావిస్తూ టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి క‌ల్వ‌కుంట్ల తారక రామారావు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 

విద్యార్థుల త‌ర‌లింపులో బీజేపీ స‌ర్కారు పీఆర్ ఎక్సర్‌సైజ్ మాదిరిగా వ్య‌వ‌హరించింద‌ని కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు. ఈ మేర‌కు ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా మోదీ సర్కారుపై నిప్పులు చెరిగారు. మోదీ దయ వల్లే ప్రాణాలు రక్షించబడ్డాయని ఉక్రెయిన్ నుంచి తరలించిన విద్యార్థులకు రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ చెబుతున్న వీడియోను ఆయన పోస్ట్ చేశారు.

More Telugu News