Gopichand: తెలుగులో బిజీ అవుతున్న ఖుష్బూ!

  • గ్లామరస్ హీరోయిన్ గా ఖుష్బూకి మంచి క్రేజ్ 
  • తమిళంలో వరుస సినిమాలతో బిజీ 
  • ఇటీవల తెలుగు సినిమాలపై దృష్టి 
  • గోపీచంద్ సినిమాలోను ఛాన్స్
Khushbu in Sriwass movie

తెలుగు తెరకి పరిచయమైన నిన్నటి తరం కథానాయికలలో ఖుష్బూ ఒకరు. 'కలియుగ పాండవులు సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఖుష్బూ, మొదటి సినిమాతోనే గ్లామర్ పరంగా .. నటన పరంగా మంచి మార్కులు కొట్టేసింది. ఆ తరువాత 'కిరాయి దాదా'తో మరో హిట్ ను అందుకుంది. తమిళ సినిమాలతో బిజీగా ఉండటం వలన తెలుగు సినిమాలను ఆమె ఎక్కువగా చేయలేకపోయింది. 

'స్టాలిన్' సినిమాతో కేరక్టర్ ఆర్టిస్టుగా రీ ఎంట్రీ ఇచ్చిన ఆమె, ఆ తరువాత 'యమదొంగ' .. 'అజ్ఞాతవాసి' సినిమాలలో కీలకమైన పాత్రలను పోషించింది. 'అజ్ఞాతవాసి' నుంచి ఆమె తెలుగు సినిమాలపై దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తోంది. 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమాలోను ఆమె ఒక ముఖ్యమైన పాత్రను పోషించింది. ఈ నెల 4వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఇక శ్రీవాస్ దర్శకత్వంలోను ఒక సినిమా చేయడానికి ఆమె అంగీకరించింది. గోపీచంద్ హీరోగా ఈ సినిమా షూటింగు జరుపుకుంటోంది. షూటింగుకి వెల్ కమ్ చెబుతూ ఈ సినిమా టీమ్ అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలింది. విశ్వప్రసాద్ - వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్న ఈ సినిమా కెరియర్ పరంగా గోపీచంద్ కి 30 సినిమా కావడం విశేషం.

More Telugu News