Telangana: ధ‌ర‌ణి వ‌ల్లే రియ‌ల్ట‌ర్ల హ‌త్య‌.. రేవంత్ రెడ్డి ఆరోప‌ణ‌

  • ధ‌ర‌ణి పోర్ట‌ల్ మొత్తం త‌ప్పుల మ‌య‌మే
  • 20 ఏళ్ల క్రితం భూములు అమ్ముకున్న వారి పేరిటే ఇప్ప‌టికీ భూములు
  • సీఎం కేసీఆర్‌, సీఎస్ సోమేశ్ కుమార్‌లే బాధ్యులు
  • పోర్ట‌ల్‌లోని త‌ప్పుల కార‌ణంగానే గొడ‌వ‌లన్న రేవంత్ 
tpcc president revanth reddy viral comments on dharani portal

హైద‌రాబాద్ శివారు ప్రాంతం ఇబ్ర‌హీంప‌ట్నంలో మంగ‌ళ‌వారం జ‌రిగిన రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారుల హ‌త్య‌కు తెలంగాణ ప్ర‌భుత్వం కొత్త‌గా తీసుకువ‌చ్చిన ధ‌ర‌ణి పోర్ట‌లే కార‌ణ‌మంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోప‌ణ‌లు చేశారు. భూవివాదం పరిష్కారం కోసం మాట్లాడుకుందామని పిలిచి కాల్పులు జరపగా.. ఒక రియల్టర్‌ ఘటనా స్థలంలోను.. మరో రియల్టర్‌ ఆస్పత్రిలోను చికిత్స పొందుతూ మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. ఈ హ‌త్య‌కు సంబంధించి ద‌ర్యాప్తు మొద‌లెట్టిన పోలీసులు ఇప్ప‌టికే ప‌లువురు నిందితుల‌ను అరెస్ట్ చేసిన‌ట్టుగా తెలుస్తోంది. 

ఈ ఘ‌ట‌న‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి బుధ‌వారం నాడు ఆరోప‌ణ‌లు గుప్పించారు. సీఎం కేసీఆర్‌, సీఎస్ సోమేశ్ కుమార్‌ కలిసే ధరణి పోర్టల్‌ తెచ్చారని గుర్తుచేసిన ఆయన.. ఆ పోర్టల్‌లో మొత్తం తప్పులే ఉన్నాయని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పోర్ట‌ల్‌లోని త‌ప్పుల కార‌ణంగా చాలా చోట్ల గొడవలు జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వ తప్పిదాలతోనే హత్యలు జరుగుతున్నాయని ఆరోపించారు.

ఇబ్రహీంపట్నంలో ఇద్దరు రియల్టర్లు హ‌త్య‌కు గుర‌య్యార‌ని.. ఈ హ‌త్య‌ల‌కు ప్రధాన కారణం ధరణి పోర్టల్‌లో లోపాలేనని ఆయ‌న విమర్శించారు. 20 ఏళ్ల క్రితం భూములు అమ్ముకున్న వారి పేర్ల‌పైనే ఇంకా ఆ భూములు ఉన్న‌ట్లుగా ధ‌ర‌ణి పోర్ట‌ల్ చూపిస్తోందని.. దీంతో భూమి కొన్నవారు ఆగమై హత్యలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

More Telugu News