Ukraine: రొమేనియా సరిహద్దులో నరకంలా అనిపించింది: భయానక పరిస్థితులను వివరించిన భారత్ కు తిరిగొచ్చిన విద్యార్థి

  • రొమేనియా బోర్డర్ వద్ద సైన్యం దారుణంగా వ్యవహరిస్తోంది
  • మన విద్యార్థులను తుపాకులతో గుచ్చుతున్నారు
  • బోర్డర్ దాటడమే అసలైన సమస్య
  • బోర్డర్ దాటిన తర్వాత ఎలాంటి ఇబ్బంది లేదు
  • మన ఎంబసీ చాలా జాగ్రత్తలు తీసుకుంటోందన్న విద్యార్ధి 
I saw hell near Romania border says student returned from Ukraine

ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చే కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం ముమ్మరం చేసింది. ఆ దేశానికి సరిహద్దుల్లో ఉన్న వివిధ దేశాల ద్వారా వెనక్కి తీసుకొస్తోంది. ఆయా దేశాల నుంచి విమానాలు ఢిల్లీలో ల్యాండ్ అవుతున్నాయి. 

ఇక బిక్కుబిక్కుమంటూ అక్కడ గడిపి స్వదేశంలో అడుగుపెట్టిన వారు హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నారు. తమ వారు తిరిగి వస్తారా? లేదా? అంటూ అనుక్షణం తీవ్ర ఆవేదన అనుభవించిన వారి కుటుంబీకులు... ఎయిర్ పోర్టులో వారిని చూడగానే కంటతడి పెట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ విమానాశ్రయంలో ఎన్నో భావోద్వేగ సన్నివేశాలు అందరినీ కలచివేస్తున్నాయి. 

ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన శుభాన్షు అనే విద్యార్థి ఢిల్లీ విమానాశ్రయం వద్ద తన తల్లిని చూడగానే తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. తల్లీకుమారులు ఇద్దరూ ఒకరినొకరు హత్తుకుని కంటతడి పెట్టుకున్నారు. ఈ సందర్భంగా శుభాన్షు ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ, ఇండియాకు తిరిగి వచ్చే క్రమంలో నరకాన్ని చూశానని చెప్పాడు. ఇండియాకు తిరిగి వచ్చేంత వరకు మనవాళ్లు ఎన్ని బాధలు పడుతున్నారో వివరించాడు. తనతో పాటు వందలాది భారతీయ విద్యార్థులు సరిహద్దు దేశాలకు చేరుకుని, అక్కడి నుంచి ఎలా బయటపడ్దారో... ఆయన మాటల్లోనే చూద్దాం. 

"విన్నిట్సియా నగరం నుంచి బోర్డర్ కు మేము ప్రయాణించాం. మా ప్రయాణం సామాన్యమైనది కాదు. మా కాంట్రాక్టర్లు బస్సులను ఏర్పాటు చేశారు. బోర్డర్ వరకు సేఫ్ గానే వెళ్లాం. 12 కిలోమీటర్లు నడవాల్సి వచ్చింది. నడవడం సమస్య కాదు. అసలైన సమస్య రొమేనియన్ బోర్డర్ ను దాటడమే. ఉక్రెయిన్ భూభాగం నుంచి రొమేనియా బోర్డర్ ను దాటడం అసంభవం అనిపించింది. 

బోర్డర్ లో విద్యార్థులు ఏడుస్తున్నారు. బోర్డర్ ను దాటేందుకు అడుక్కుంటుండం నేను చూశా. తీవ్ర ఒత్తిడిలో మూర్ఛపోయినవారు కూడా ఉన్నారు. తమను బోర్డర్ దాటించాలని కాళ్లకు మొక్కుతున్నారు. అప్పటి వరకు నేను ముందు వెళ్తా, నేను ముందు వెళ్తా అనే రీతిలో వ్యవహరించిన విద్యార్థులకు విషయం అర్థమయింది. ఆ తర్వాత వారిలోవారు గొడవపడటం మానేశారు. నేను హింసకు గురికానప్పటికీ... అక్కడ నెలకొన్న దారుణమైన పరిస్థితిని చూశాను.

కొందరు విద్యార్థులను అక్కడి సైన్యం రైఫిళ్లతో పొడిచింది. పరిస్థితి భయానకంగా ఉంది. వాళ్లు మమ్మల్ని ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. బోర్డర్ గేట్లు తెరిచిన తర్వాత రొమేనియా అధికారులు తొలి ప్రాధాన్యతను ఉక్రేనియన్లకే ఇచ్చారు. అయితే ఇండియన్ ఎంబసీ అధికారులు మా పట్ల చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. బోర్దర్ దాటిన తర్వాత ఎలాంటి సమస్య ఎదురు కాలేదు. ఆ తర్వాత అంతా సవ్యంగా జరిగిపోయింది. నా స్నేహితులు కొంత మంది ఇంకా అక్కడి షెల్టర్లలోనే ఉన్నారు. అక్కడి అకామడేషన్ ఫైవ్ స్టార్ స్థాయిలో చాలా బాగుంది. కానీ సరిహద్దు వద్ద మాత్రం పరిస్థితి అత్యంత దారుణంగా, నరకాన్ని తలపించేలా ఉంది" అని తను అనుభవాన్ని వివరించాడు.

More Telugu News