Telangana: ఎనిమిదేళ్ల‌లోనే 125 శాతం పెరిగిన తెలంగాణ త‌ల‌స‌రి ఆదాయం: మంత్రి కేటీఆర్

  • జీఎస్‌డీపీలో ఏకంగా 130 శాతం వృద్ధి
  • దేశంలోనే అన్ని రంగాల్లో తెలంగాణే అగ్ర‌గామి
  • కేంద్రం గ‌ణాంకాల్లో స‌త్తా చాటిన తెలంగాణ‌
  • ట్విట్ట‌ర్ వేదిక‌గా మంత్రి కేటీఆర్ వెల్ల‌డి
telangana records in per capita income growth

తెలంగాణ రాష్ట్రంగా ఏర్ప‌డి ఎనిమిదేళ్లే అవుతోంది. అయితేనేం, దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే కూడా అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. త‌ల‌స‌రి ఆదాయంతో పాటు జీఎస్‌డీపీలోనూ వంద శాతాన్ని మించిన వృద్ధిని న‌మోదు చేసింది. ఆయా అంశాల్లో దేశంలోని ఆయా రాష్ట్రాలు సాధించిన పురోగ‌తికి సంబంధించి కేంద్ర ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన గ‌ణాంకాలు ఇదే విష‌యాన్నిచెబుతున్నాయి. ఈ విష‌యాన్ని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి క‌ల్వ‌కుంట్ల తార‌క‌రామారావు ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించారు. తెలంగాణ వేగవంత‌మైన వృద్ధిపై ఆయ‌న హ‌ర్షం వ్యక్తం చేశారు. 

ఇక కేంద్రం గ‌ణాంకాల ప్ర‌కారం తెలంగాణ ఏఏ రంగంలో ఏ మేర అభివృద్ధి సాధించింద‌న్న విష‌యానికి వ‌స్తే.. త‌ల‌స‌రి ఆదాయంలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. త‌ల‌స‌రి ఆదాయం 2014 నుంచి 2021 వ‌ర‌కు 125 శాతం పెరిగితే.. జీఎస్‌డీపీ 130 శాతం పెరిగింది. విభ‌జ‌న స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కాన‌ప్పటికీ, క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ల్ల ఆర్థిక వ్యవ‌స్థ కుదేలైన‌ప్ప‌టికీ, కేంద్రం నుంచి ఎలాంటి స‌హ‌కారం లేకున్నా తెలంగాణ రాష్ట్రం గ‌ణ‌నీయ‌మైన అభివృద్ధిని సాధిస్తోంద‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. అద్భుత‌మైన కేసీఆర్ పాల‌న‌కు కేటీఆర్ ధ‌న్య‌వాదాలు చెప్పారు.

  "ఎనిమిదేండ్ల కింద పురుడుపోసుకున్న మన తెలంగాణ.. నేడు దేశంలోనే అత్యధిక వృద్ధిరేటు నమోదు చేసింది. ఉద్యమనేత సీఎం కేసీఆర్ గారి పాలనలో నేడు దేశానికే స్ఫూర్తిగా నిలిచింది" అంటూ కేటీఆర్ త‌న హ‌ర్షాన్ని వ్య‌క్తం చేశారు.

More Telugu News