Maha Shivaratri: శివనామస్మరణతో త‌న్మ‌య‌త్వంలో మునిగితేలుతోన్న భ‌క్తులు.. ఆల‌యాలు కిట‌కిట‌

  • నేడు మహా శివరాత్రి 
  • శివాల‌యాల్లో భక్తుల పూజ‌లు
  • స్వామివారికి మహాభిషేకం, లింగోద్భవ పూజలు
  • క‌రోనా ఆంక్ష‌లు స‌డ‌లించ‌డంతో శైవక్షేత్రాలకు పోటెత్తిన‌ భ‌క్తులు
Maha Shivaratri in temples

మహా శివరాత్రి సందర్భంగా శివాల‌యాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. హ‌ర‌హ‌ర మ‌హాదేవ శంభోశంక‌రా అంటూ భక్తులు శివనామస్మరణతో త‌న్మ‌య‌త్వంలో మునిగితేలుతున్నారు. తెల్ల‌వారుజాము నుంచే భక్తులు శైవక్షేత్రాలకు చేరుకున్నారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తున్నారు. 

కాళేశ్వరం ఆలయానికి మహాశివరాత్రి సంద‌ర్భంగా భక్తులు భారీగా త‌ర‌లివ‌చ్చారు. ఈ రోజు సాయంత్రం 4.30 గంటలకు వైభవంగా శ్రీ ముక్తీశ్వర శుభానందల కల్యాణ మహోత్సవం ఉంది. అలాగే, ఈ రోజు రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు, మహాభిషేకం, లింగోద్భవ పూజ నిర్వహించనున్నారు. 

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల తాకిడి అధికంగా ఉంది. రెండేళ్లుగా క‌రోనా కారణంగా మహాశివరాత్రికి వేడుకలు అంతగా జ‌ర‌గ‌లేద‌న్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు క‌రోనా ఆంక్ష‌లు లేక‌పోవ‌డంతో శైవక్షేత్రాలకు భ‌క్తులు పోటెత్తుతున్నారు. మేడ్చల్‌ జిల్లాలోని కీసరగుట్టలో బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. 

మ‌రోవైపు, క‌ర్నూలులోని యాగంటి క్షేత్రంలో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి దంపతులు మహన్యాస పూర్వక రుద్రాభిషేకం, కుంకుమార్చన సేవ‌ల్లో పాల్గొన్నారు. నేటి రాత్రి 12 గంటలకు లింగోద్భవం కాల పూజలు జరుగుతాయి. రేపు ఉద‌యం ఉమామహేశ్వర స్వామి వారి కల్యాణోత్సవం నిర్వహిస్తారు. మెదక్‌ జిల్లాలోని ఏడుపాయల జాతరను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. సంగారెడ్డి జిల్లా ఫసల్‌లవాదికి స‌మీపంలో పంచముఖ ఉమా మహేశ్వరస్వామి ఆలయంలో 18 అడుగుల పత్ర లింగేశ్వరాన్ని పూజ‌ల‌కు సిద్ధం చేశారు.

సూర్యాపేటలో బ్రహ్మ కుమారీస్‌ ఆధ్వర్యంలో 25 అడుగుల శివలింగాన్ని ఏర్పాటు చేశారు. అలాగే, తెలుగు రాష్ట్రాల్లోని ఇత‌ర శైవక్షేత్రాలన్నీ మహా శివరాత్రి శోభను సంతరించుకున్నాయి. నేటి మహా శివరాత్రి మహోత్సవాలకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. 

More Telugu News