Pawan Kalyan: 'భీమ్లా నాయ‌క్' సినిమాలోని ఓ సన్నివేశంపై గుంటూరు అర్బన్‌ ఎస్పీకి ఫిర్యాదు

  • ఆంధ్ర‌దేశ్‌ కుమ్మరి, శాలివాహన కార్పొరేషన్ ఫిర్యాదు 
  • కుమ్మరుల మనోభావాలు దెబ్బతినేలా ఓ సన్నివేశం 
  • దాన్ని తొలగించాలని డిమాండ్‌
  • రానా కుమ్మరి చక్రాన్ని కాలితో తన్నాడని అభ్యంత‌రం
complaint against bheemla nayak

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించి భీమ్లా నాయక్ సినిమాపై ఆంధ్ర‌ప్రదేశ్‌ కుమ్మరి, శాలివాహన కార్పొరేషన్ ఫిర్యాదు చేసింది. ఆ సినిమాలో కుమ్మరుల మనోభావాలు దెబ్బతినేలా ఓ సన్నివేశం ఉంద‌ని, దాన్ని తొలగించాలని ఏపీ కుమ్మరి, శాలివాహన కార్పొరేషన్‌ ఛైర్మన్‌ ఎం.పురుషోత్తం గుంటూరు అర్బన్‌ ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌కు ఫిర్యాదు చేశారు.

భీమ్లానాయక్ సినిమాలో దగ్గుబాటి రానా ఓ స‌న్నివేశంలో కుమ్మరి చక్రాన్ని కాలితో తన్నుతాడ‌ని, అనంత‌రం తన ప్రత్యర్థిపై దాడి చేస్తాడ‌ని పురుషోత్తం తెలిపారు. తాము కుమ్మరి చక్రంను ఎంతో పవిత్రంగా భావిస్తామ‌ని అన్నారు. అటువంటి దాన్ని తన్నడం కుమ్మరుల మనోభావాలు దెబ్బతీసేలా ఉందని విమర్శించారు. ఈ సన్నివేశం తమను కించపరిచేలా ఉంద‌ని వివ‌రించారు. 

సినిమా దర్శకుడు, నిర్మాత, కథానాయకులపై చర్యలు తీసుకోవాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. వెంట‌నే భీమ్లా నాయ‌క్ సినిమాలోని ఆ సన్నివేశాన్ని తొలగించేలా చూడాలని కోరిన‌ట్లు ఆయ‌న చెప్పారు. కాగా, పవన్ కల్యాణ్, రానా కాంబినేషన్లో వచ్చిన 'భీమ్లా నాయక్' సూపర్ హిట్ అయిన విష‌యం తెలిసిందే. ఈ సినిమా గ‌త నెల 25న విడుద‌లైంది.

More Telugu News