Telangana: తెలంగాణ అట‌వీ శాఖ సంర‌క్ష‌ణ ప్ర‌ధాన అధికారిగా హ‌రిత హారం సార‌థి

  • పీసీసీఎఫ్ శోభ ప‌ద‌వీ విర‌మ‌ణ‌తో డోబ్రియాల్‌కు కొత్త బాధ్య‌త‌లు
  • హ‌రిత హారం విజ‌యవంతంలో డోబ్రియాల్ కీల‌క భూమిక‌
  • ఉత్త‌రాఖండ్‌కు చెందిన డోబ్రియాల్‌

తెలంగాణ అట‌వీ శాఖ సంర‌క్ష‌ణ ప్ర‌ధాన అధికారి(పీసీసీఎఫ్‌)గా ఆర్ఎం డోబ్రియాల్‌ను నియ‌మిస్తూ సోమ‌వారం నాడు కేసీఆర్ స‌ర్కారు నిర్ణ‌యం తీసుకుంది. టీఆర్ఎస్ స‌ర్కారు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన హ‌రిత‌హారం రాష్ట్ర నోడ‌ల్ అధికారిగా గ‌డ‌చిన ఆరేళ్లుగా ప‌నిచేస్తున్న డోబ్రియాల్‌ ఇప్పుడు పీసీసీఎఫ్‌గా నియమితులయ్యారు. ఇప్ప‌టిదాకా పీసీసీఎఫ్‌గా ప‌నిచేస్తున్న శోభ సోమ‌వారం నాడు ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌డంతో ఆ పోస్టులోకి డోబ్రియాల్‌ను నియ‌మిస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. 

ప్రస్తుతం డోబ్రియల్ సోషల్ ఫారెస్ట్రీకి పీసీసీఎఫ్ గా, తెలంగాణకు హరితహారం రాష్ట్ర నోడల్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు. హరితహారం విజయవంతంలో తనవంతు పాత్ర పోషించారు. అలాగే సీనియారిటీ ప్రకారం కూడా ముందున్నారు. దీంతో ఆయనకే పూర్తి అదనపు బాధ్యతలు ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ లాంఛనాల తర్వాత పూర్తి స్థాయి పీసీసీఎఫ్ గా ఆయన కొనసాగే అవకాశం ఉంది.

ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన డోబ్రియల్ 1987లో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ లో చేరారు. ట్రైనింగ్ తర్వాత 1989లో పాల్వంచ సబ్ డీఎఫ్ఓగా, భద్రాచలం డివిజనల్ ఫారెస్ట్ అధికారిగా పనిచేశారు. అదే హోదాలో 2002 వరకు వరంగల్, బెల్లంపల్లి డివిజన్లలో పనిచేశారు. కన్జర్వేటర్ గా పదోన్నతి పొందిన తర్వాత అడిషనల్ సెక్రటరీ హోదాలో సచివాలయంలో వ్యవసాయ శాఖ, ఉన్నత విద్యాశాఖల్లో వివిధ హోదాల్లో డిప్యుటేషన్ పై పనిచేశారు.

More Telugu News