AP Govt: ఉక్రెయిన్ లో చిక్కుకున్న 423 మంది తెలుగు విద్యార్థులను మ్యాపింగ్ చేశాం: కృష్ణబాబు

  • ఉక్రెయిన్ లో 7 వర్సిటీల్లో ఏపీ విద్యార్థులు
  • విద్యార్థులను తీసుకొచ్చేందుకు ఏపీ టాస్క్ ఫోర్స్ కమిటీ
  • కృష్ణబాబు నేతృత్వంలో పనిచేస్తున్న కమిటీ
  • విద్యార్థులు సరిహద్దు వద్దకు వెళ్లరాదని సూచన
AP govt established task force to relocate students from Ukraine

ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన ఏపీ విద్యార్థులను తీసుకొచ్చేందుకు టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటైన సంగతి తెలిసిందే. రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటైంది. ఈ నేపథ్యంలో కృష్ణబాబు స్పందిస్తూ, ఉక్రెయిన్ లోని 7 యూనివర్సిటీల్లో ఏపీ విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు. 

ఇక ఉక్రెయిన్ లో చిక్కుకున్న 423 మంది ఏపీ విద్యార్థులు ఎక్కడెక్కడ ఉన్నదీ మ్యాపింగ్ చేశామని తెలిపారు. మ్యాపింగ్ చేసిన వాళ్లతో వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసి సూచనలు ఇస్తున్నామని వెల్లడించారు. 23 మంది విద్యార్థులు స్వదేశానికి వస్తున్నారని కేంద్రం సమాచారం ఇచ్చిందని పేర్కొన్నారు. వారిలో ఏపీకి చెందినవారు ముగ్గురే ఉన్నట్టు తమ పరిశీలనలో తేలిందని కృష్ణబాబు వివరించారు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఏపీ భవన్ తరఫున హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని చెప్పారు. 

ఉక్రెయిన్ లో సరిహద్దు ప్రాంతాలకు వెళ్లొద్దని భారతీయులకు సూచనలు వచ్చాయని వెల్లడించారు. అదే విషయాన్ని ఏపీ విద్యార్థులకు వివరించామని, సరిహద్దుల వద్దకు వెళ్లొద్దని స్పష్టం చేశామని కృష్ణబాబు వివరించారు. విద్యార్థులు చదువుతున్న యూనివర్సిటీలకు సమీపంలోని రుమేనియా ఎంబసీలను సంప్రదిస్తున్నామని అన్నారు. 

కాగా, ఉక్రెయిన్ లోని ఏపీ విద్యార్థులు తప్ప ప్రవాసాంధ్రులెవరూ తమను సంప్రదించలేదని కృష్ణబాబు పేర్కొన్నారు. ఉక్రెయిన్ లో ఏపీ వాళ్లు ఎంతమంది ఉన్నారనే వివరాలు రాబడుతున్నామని తెలిపారు. వీసా స్టాంపింగ్, ఐబీ, విదేశీ విద్యలకు విద్యార్థులను పంపే ఏజెన్సీల నుంచి సమాచారం సేకరిస్తున్నామని వెల్లడించారు.

More Telugu News