Ukraine: ర‌ష్యా, ఉక్రెయిన్‌ల యుద్ధంపై చైనా కీల‌క ప్ర‌క‌ట‌న‌

  • ఇరు దేశాలు చ‌ర్చ‌ల ద్వారానే స‌మ‌స్య‌ను ప‌రిష్కరించుకోవాలి
  • ఇరు దేశాల మ‌ధ్య శాంతి నెల‌కొనేందుకు కృషి
  • చైనా అధ్య‌క్షుడు జిన్ పింగ్ ప్ర‌క‌ట‌న‌
China key statement on Russia Ukraine war

ర‌ష్యా, ఉక్రెయిన్ల మ‌ధ్య కొన‌సాగుతున్న యుద్ధంపై ప్ర‌పంచ దేశాలు స్పందించ‌డం మొద‌లెట్టాయి. ఇప్ప‌టికే నాటో దేశాల‌తో పాటు అమెరికా కూడా త‌న వైఖ‌రిని స్ప‌ష్టం చేసింది. తాజాగా ప్ర‌పంచంలో మ‌రో అగ్ర‌దేశంగా ప‌రిగ‌ణిస్తున్న చైనా కూడా ఈ యుద్ధంపై స్పందించింది.

ర‌ష్యా, ఉక్రెయిన్ దేశాలు త‌మ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకునేందుకు చ‌ర్చ‌ల‌నే ఆశ్ర‌యించాల‌ని చైనా అభిప్రాయ‌ప‌డింది. ఈ మేర‌కు చైనా అధ్య‌క్షుడు జీ జిన్ పింగ్ కాసేప‌టి క్రితం ఓ కీల‌క ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల‌ చేశారు. చ‌ర్చ‌ల ద్వారానే ర‌ష్యా, ఉక్రెయిన్లు స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకోవాల‌ని చెప్పిన జిన్ పింగ్‌.. ఇరు దేశాల మ‌ధ్య శాంతిని నెల‌కొల్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామ‌ని కూడా ప్ర‌క‌టించారు.

ఇదిలావుంచితే, ఉక్రెయిన్‌పై ఇప్ప‌టికే భీకర దాడుల‌కు రష్యా పాల్ప‌డుతోంటే..ఆ దాడుల‌ను తిప్పికొట్టేందుకు ఉక్రెయిన్ కూడా హోరాహోరీగానే పోరాడుతోంది. ఇలాంటి స‌మ‌యంలో చైనా అధ్య‌క్షుడు జిన్ పింగ్ ఇరు దేశాల మ‌ధ్య శాంతి నెల‌కొల్పేందుకు సిద్ధ‌మంటూ ప్ర‌కట‌న చేయ‌డం గ‌మ‌నార్హం.

మ‌రోవైపు..యుద్ధం జ‌రుగుతున్న వేళ శుక్ర‌వారం నాడు చైనా అధ్య‌క్షుడు జిన్ పింగ్ ర‌ష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఫోన్ చేశారు. ఉక్రెయిన్‌లో కొన‌సాగుతున్న సంక్షోభ ప‌రిస్థితుల‌పై పుతిన్‌తో జిన్ పింగ్ చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం.

More Telugu News