Russia: ఎటుచూసినా భావోద్వేగ పరిస్థితులు.. కీవ్ ను ఖాళీ చేసి వెళ్తున్న జనం.. మెట్రో స్టేషన్లు, బాంబు షెల్టర్లకు జనం క్యూ.. కిలోమీటర్ల మేర కార్లు

  • పిల్లలకు ధైర్యం నూరిపోస్తున్న తల్లిదండ్రులు
  • బాంబు షెల్టర్లకు దారి చూపుతూ గోడలపై బాణం గుర్తులు
  • వీధుల్లో ప్రార్థనలు చేస్తున్న ప్రజలు
Public Evacuating Kyiv Amid Russia Attacks

ఉక్రెయిన్ పై రష్యా దాడి నేపథ్యంలో రాజధాని కీవ్ లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఎటుపక్క నుంచి ఏ క్షిపణి వచ్చి పడుతుందో.. ఏ బాంబు వచ్చి పేలుతుందో తెలియని దిక్కు తోచని పరిస్థితుల్లో ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారు.

తట్టాబుట్ట సర్దుకుని పిల్లలు, పెంపుడు జంతువులను చంకనెత్తుకుని ప్రాణాలరచేత పట్టుకుని కీవ్ ను విడిచిపెట్టి వెళ్లిపోతున్నారు. మరికొందరు బాంబులు, క్షిపణుల దాడి నుంచి తప్పించుకునేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక బంకర్లలోకి వెళ్తున్నారు. అందుకోసం బంకర్లకు దారెటుందో చూపిస్తూ గోడలపై ఎర్రని మార్కుతో బాణం గుర్తులేశారు. 2014లోనే ఏర్పాటు చేసిన బాంబు షెల్టర్ల అవసరం ఇప్పుడు రావడంతో.. వాటికి దారి తెలిసేలా ఫ్రెష్ గా గోడలపై పెయింటింగులు వేశారు.

దీంతో కీవ్ లోని వీధులు, మెట్రో స్టేషన్లన్నీ జనంతో నిండిపోయాయి. వీధులన్నీ భావోద్వేగ భరితంగా మారాయి. కొందరు తలదాచుకోవడానికి మెట్రో అండర్ గ్రౌండ్ స్టేషన్లకు వెళితే.. మరికొందరు ఏ రైలు దొరికితే ఆ రైలు ఎక్కేసి సిటీని దాటెళ్లిపోయారు. మరికొందరు బస్సుల్లో కిక్కిరిసి ప్రయాణించారు.

లోలోపల ఏ భయాలున్నా ఏం కాదంటూ పిల్లలకు ధైర్యం నూరిపోస్తూ కనిపించిన తల్లుల దృశ్యాలు కలచివేస్తున్నాయి. వీధుల్లో జనాలు ప్రార్థనలు చేస్తూ కనిపించారు. ఇక, నగరాన్ని విడిచివెళ్లిపోతున్న వారి కార్లతో సిటీ రహదారులన్నీ నిండిపోయాయి. ఎటు చూసినా కిలోమీటర్లకొద్దీ కార్ల ట్రాఫిక్ కనిపించింది. కీవ్ నుంచి సిటీ పశ్చిమ ప్రాంతానికి చాలా మంది తరలివెళ్లిపోతున్నారు. మొత్తంగా సిటీ అంతటా ఓ రకమైన భావోద్వేగ పరిస్థితులు నెలకొన్నాయి.

More Telugu News