YSRCP: వివేకానందరెడ్డి గాయాలను పువ్వులతో కవర్ చేయాలని చూశారు.. సైలెంట్‌గా ఉండకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు: సీఐ శంకరయ్య

  • న్యాయవాది ఓబుల్‌రెడ్డి వచ్చి మాట్లాడాకే సాక్ష్యాల ధ్వంసం
  • వివేకా మృతదేహంపై ఉన్న రక్తపు మరకల దుస్తులను మార్చే యత్నం చేశారు
  • వీడియో తీస్తుంటే ఆపాలంటూ శివశంకర్‌రెడ్డి కేకలు వేశారు
  • గాయాల విషయం బయటకు చెబితే జాగ్రత్త అంటూ శివశంకర్‌రెడ్డి హెచ్చరించారు
  • వివేకా సహాయకుడు ఇనయతుల్లాను కూడా హెచ్చరించారు
CI Sankaraiah Sensational Statemet to CBI On vivekas murder

సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో పలు సంచలన విషయాలు వెల్లడించిన అప్పటి పులివెందుల సీఐ శంకరయ్య.. వివేకా శరీరంపై ఉన్న గాయాలు బయటకు కనబడకుండా ఎలా కవర్ చేసిందీ సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించారు. గాయాలపై పూర్తిగా పువ్వులు పేర్చి అవి కనిపించకుండా చేసే ప్రయత్నం చేశారన్నారు. హత్య సమాచారం అందుకున్న వెంటనే తాను ఘటనా స్థలానికి చేరుకున్నానని, అప్పటికే కొందరు వ్యక్తులు ఫ్రీజర్‌ను తీసుకొచ్చి మృతదేహాన్ని అందులో పెట్టేందుకు ప్రయత్నిస్తే తాను తిప్పి పంపించానన్నారు.

మృతదేహానికి పోస్టుమార్టం చేయించిన తర్వాత ఫ్రీజర్‌లో పెట్టాలని ఎర్ర గంగిరెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డికి తేల్చి చెప్పానన్నారు. దీంతో వారు ఆ విషయాన్ని అవినాష్‌రెడ్డి, వైఎస్ భాస్కరరెడ్డి, మనోహర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారని, ఆ తర్వాత శివశంకర్‌రెడ్డి అంబులెన్స్ పిలిపించారని వివరించారు. న్యాయవాది ఓబుల్‌రెడ్డి వివేకా ఇంటికి వచ్చిన తర్వాత లోపలున్న రక్తపు మరకలను చూసి బయటకు వచ్చి గంగిరెడ్డి, శివశంకర్‌రెడ్డితో మాట్లాడారని, ఆ తర్వాతే ఆధారాల ధ్వంసం కార్యక్రమం మొదలైందన్నారు.

అంతకుముందు తనకు అవినాష్‌రెడ్డి నుంచి ఫోన్ వచ్చిందని, వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించారని, ఆయన ఇంటి వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న జనాన్ని నియంత్రించేందుకు సిబ్బందిని పంపాలని చెప్పారని అన్నారు. దీంతో ముగ్గురు కానిస్టేబుళ్లతో కలిసి వెంటనే తాను ఘటనా స్థలానికి చేరుకున్నట్టు సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో శంకరయ్య తెలిపారు. తాను అక్కడికి వెళ్లాక వివేకా ఇంట్లోకి కానిస్టేబుళ్లు వెళ్లకుండా శివశంకర్‌రెడ్డి అడ్డుకున్నారని, తనను మాత్రమే లోపలికి పంపారని పేర్కొన్నారు.

అక్కడి పరిస్థితులు స్నానాల గది, పడకగదితోపాటు వివేకా మృతదేహంపై రక్తపు మరకలు, గాయాలు చూసి అది గుండెపోటు అని అనిపించడం లేదని శివశంకర్‌రెడ్డితో చెప్పానని.. దీంతో ఆయన తీవ్రంగా స్పందించారని పేర్కొన్నారు. నోర్మూసుకుని ఉండాలని, గాయాల విషయం బయటపెడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని శివశంకర్‌రెడ్డి తనను హెచ్చరించారన్నారు. వివేకా సహాయకుడు ఇనయతుల్లా కూడా మృతిపై అనుమానం వ్యక్తం చేస్తే.. మీ సార్‌కు ఎవరితోనూ శత్రుత్వం లేదని, ఆయన్ను ఎవరూ హత్య చేసే అవకాశమే లేదని శివశంకర్‌రెడ్డి ఆయనను కూడా బెదిరించారని శంకరయ్య తన వాంగ్మూలంలో పేర్కొన్నారు.

బాత్రూములో హత్యకు గురైన వివేకా మృతదేహాన్ని గంగిరెడ్డి బెడ్రూములోకి తీసుకొచ్చారని, రక్తపు మరకలతో ఉన్న ఆయన దుస్తులను మార్చేందుకు ప్రయత్నించారని అన్నారు. అయితే, మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించాలని, కాబట్టి దుస్తులు మార్చడానికి వీల్లేదని తాను చెప్పానని అన్నారు. అంతేకాదు, ఘటనా స్థలాన్ని వీడియో తీయాలని తమ సిబ్బందికి చెప్పానని, వారు ఆ పని చేస్తుండగా.. వీడియో తీయొద్దంటూ దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి గట్టిగా కేకలు వేశారన్నారు.

ఎర్ర గంగిరెడ్డి, ఎవీ కృష్ణారెడ్డి, ఉమాశంకర్‌రెడ్డి, సునీల్ యాదవ్, దస్తగిరి పాత్ర అనుమానాస్పదంగా అనిపించిందని కూడా చెప్పారు. అలాగే, ఘటనా స్థలంలో అవినాష్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి ప్రవర్తించిన తీరు కూడా అనుమానాలు రేకెత్తించిందని శంకరయ్య వివరించారు. వివేకా ఇంటి వద్ద బందోబస్తుకు రావాలంటూ వైసీపీ సన్నిహిత న్యాయవాది ఓబుల్‌రెడ్డి, సాక్షి విలేకరి తనపై ఒత్తిడి తీసుకొచ్చారన్నారు.

వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయారని అవినాశ్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డే తొలుత ప్రచారం ప్రారంభించారని శంకరయ్య తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. అలాగే, వివేకా హత్య కేసులో గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డి పాత్ర కూడా అనుమానాస్పదంగా ఉన్నట్టు తన దర్యాప్తులో వెల్లడైందని పులివెందుల డీఎస్పీగా గతంలో పనిచేసిన రెడ్డివారి వాసుదేవన్ సీబీఐకి తెలిపారు.

  • Loading...

More Telugu News