YS Vivekananda Reddy: వివేకా హ‌త్య కేసులో క‌ల‌కలం రేపుతున్న‌ ద‌స్త‌గిరి తాజా వాంగ్మూలం

  • వివేకా వ‌ద్ద కారు డ్రైవ‌ర్‌గా ప‌నిచేసిన ద‌స్త‌గిరి
  • గ‌తేడాది ఆగ‌స్టులోనే అప్రూవ‌ర్‌గా మారిన వైనం
  • ఆ త‌ర్వాతే కొంద‌రు వ్య‌క్తులు త‌న‌ను ప్ర‌లోభ‌పెట్టార‌ని ఫిర్యాదు
  • ఈ విష‌యాల‌న్నింటితో తాజా వాంగ్మూలం
Threats to approver in YS Vivekananda Reddy murder case

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బాబాయి వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసుకు సంబంధించి తాజాగా పులివెందుల కోర్టులో దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం పెను క‌ల‌క‌ల‌మే రేపుతోంది. వివేకా వ‌ద్ద కారు డ్రైవ‌ర్‌గా ప‌నిచేసిన ద‌స్త‌గిరి ఇదివ‌రకే ఈ కేసులో అప్రూవ‌ర్‌గా మారిన సంగ‌తి తెలిసిందే. అయితే అప్రూవర్‌గా మారిన త‌ర్వాత కూడా త‌న‌ను కొంద‌రు క‌లిశార‌ని, త‌మ మాట వింటే ప‌దెక‌రాల పొలంతో పాటు అడిగినంత మేర డ‌బ్బు ఇస్తామ‌ని చెప్పార‌ని ద‌స్తగిరి తాజాగా ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నాడు.  

ఇక ఈ తాజా వాంగ్మూలం ప్రకారం.. ఈ కేసులో అప్రూవ‌ర్‌గా మారిన త‌ర్వాత భ‌ర‌త్ అనే వ్య‌క్తి త‌న‌ను హెలిప్యాడ్ వ‌ద్ద‌కు ర‌మ్మన్నాడ‌ని ద‌స్త‌గిరి పేర్కొన్నాడు. ఆ మేర‌కు ‌తాను హెలిప్యాడ్ వద్ద‌కు వెళ్ల‌గా.. భ‌ర‌త్‌తో పాటు ఈ కేసులో కీల‌క నిందితుడిగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న దేవిరెడ్డి శంక‌ర్ రెడ్డితో పాటు ఆయ‌న న్యాయ‌వాది ఓబుల్ రెడ్డి వ‌చ్చార‌ని తెలిపాడు.

తాము చెప్పిన‌ట్లుగా వింటే 10 ఎక‌రాల పొలంతో పాటు అడిగినంత డ‌బ్బు ఇస్తామ‌ని చెప్పార‌న్నారు. ఇదే విష‌యాన్ని తాను సీబీఐకి పిర్యాదు చేసిన‌ట్లుగా ద‌స్త‌గిరి చెప్పాడు. ఈ కేసులో గ‌తేడాది ఆగ‌స్ట్ 25న అప్రూవ‌ర్‌గా మారిన ద‌స్త‌గిరి సీబీఐకి స్టేట్ మెంట్ ఇవ్వ‌గా అదే విష‌యాన్ని అదే నెల 31న జ‌మ్మ‌ల‌మ‌డుగు కోర్టులో ఒప్పుకున్నాడు. కాగా త‌న‌ను భ‌ర‌త్ త‌దిత‌రులు క‌లిసి ప్ర‌లోభానికి గురి చేసిన‌ట్టుగా సెప్టెంబ‌ర్ 30న సీబీఐకి ద‌స్త‌గిరి ఫిర్యాదు చేశారు. ఈ విష‌యాల‌న్నింటిని తాజా వాంగ్మూలంలో ద‌స్త‌గిరి పేర్కొన్నాడు.

More Telugu News