Pawan Kalyan: మేడారం జాతర దేశానికే తలమానికం: పవన్ కల్యాణ్

  • ఈ నెల 16 నుంచి 19 వరకు మేడారం జాతర
  • తెలంగాణలో మొదలైన కోలాహలం
  • సమ్మక్క, సారలమ్మ వీరత్వానికి ప్రతీకలు అన్న పవన్
Pawan Kalyan hails Medaram Jatara

తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా నిలిచే మేడారం జాతర రేపటి నుంచి జరగనుంది. దీనిపై జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ స్పందించారు. మహిమాన్వితమైన మేడారం జాతర సందర్భంగా తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా అడవితల్లి బిడ్డలకు భక్తిపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. బుధవారం మొదలవుతున్న సమ్మక్క-సారలమ్మ జాతర భారతీయ సనాతన ధార్మిక విశిష్టతకు నిలువెత్తు నిదర్శనం అని పేర్కొన్నారు. ఈ దేవతలు అడవి బిడ్డల వీరత్వానికి ప్రతీకలు అని అభివర్ణించారు.

తెలంగాణలో అత్యంత వైభవోపేతంగా జరిగే ఈ వన జాతర దేశానికే తలమానికం అని కీర్తించారు. తెలంగాణ వాసులతో పాటు, దేశ ప్రజలందరినీ దుష్ట శక్తుల నుంచి ఈ వనదేవతలు కాపాడాలని, ప్రజలను చల్లగా చూడాలని ప్రణామాలు అర్పిస్తున్నట్టు పవన్ తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన చేశారు.

More Telugu News