CSK: రైనా దూరం కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్న సీఎస్కే అభిమానులు!

  • బేస్ ధరకైనా కొనుగోలు చేయాల్సింది
  • ధోనీ ప్రయత్నించి ఉండాల్సింది
  • ఎన్నో మ్యాచ్ లను ఒంటిచేత్తో గెలిపించాడు
  • ట్విట్టర్ పై పోస్టుల వర్షం
Fans continue to lash out at CSK for snubbing Mr IPL Sures

ఐపీఎల్ మెగా వేలం ముగిసి రెండు రోజులు కావస్తున్నా.. సీఎస్కే అభిమానుల్లో బాధ చల్లారలేదు. సురేశ్ రైనాను జట్టు కొనుగోలు చేయకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. సోషల్ మీడియాలో కామెంట్లు, పోస్ట్ లతో తమ బాధను, అభిమానాన్ని, ఆగ్రహాన్ని పలు రూపాల్లో ప్రదర్శిస్తూనే ఉన్నారు.

సురేశ్ రైనా 2008 నుంచి చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతోనే ఉన్నాడు. కాకపోతే 2021 ఐపీఎల్ సీజన్ లో పేలవ పనితీరుతో విమర్శలు ఎదుర్కొన్నాడు. అంతకుముందు కరోనా సంవత్సరంలో 2020 సీజన్ కు దూరంగా ఉండిపోయాడు. పనితీరు ఆధారంగా రైనాను జట్టు యాజమాన్యం అతడ్ని తీసుకోలేదు. దీన్ని అభిమానులు తప్పుబడుతూనే ఉన్నారు.

రైనా పనితీరుపై విశ్వాసం ఉంటే మిగిలిన తొమ్మిది ఐపీఎల్ ఫ్రాంచైజీల్లో ఒక్కటైనా బిడ్ వేయాలిగా? అదీ జరగలేదు. ఐపీఎల్ ప్రయాణంలో సురేశ్ రైనా 205 మ్యాచ్ లలో ఆడి 5,528 పరుగులు సాధించి పెట్టాడు. ఒక సెంచురీ, 39 అర్ధ సెంచురీలు చేశాడు. ‘ప్రస్తుత జట్టు కూర్పులో అతడు సరిపోడు’ అంటూ సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథ్ స్పష్టం చేయడం గమనార్హం.

సీఎస్కే దగ్గర బ్యాలన్స్ ఉన్నప్పటికీ రైనాను ఎంపిక చేయలేదంటూ ఓ అభిమాని నిట్టూర్చాడు. రైనాను సీఎస్కే కొనుగోలు చేయకపోవడాన్ని నమ్మలేకపోతున్నానని, ధోని తప్పకుండా అతడి కోసం ప్రయత్నించి ఉండాల్సిందంటూ మరో అభిమాని ట్విట్టర్ పై పోస్ట్ పెట్టాడు.

‘థ్యాంక్యూ చిన్న తల’ అంటూ మరో అభిమాని కామెంట్ చేశాడు. ఎన్నో విజయాలు అందించిన మ్యాచ్ విన్నర్ ను కనీసం బేస్ ధరకు అయినా కొనుగోలు చేయలేదని మరో అభిమాని నిట్టూర్చాడు. కానీ, ఒక అభిమాని మాత్రం 2020 సీజన్ కు రైనా దూరంగా ఉండడాన్ని ప్రస్తావించాడు. అప్పటి నుంచే బంధం బలహీనపడినట్టు పరోక్షంగా పేర్కొన్నాడు.

More Telugu News