Somu Veerraju: ప్ర‌త్యేక హోదాతో తెలంగాణ‌కు సంబంధం ఏంటీ?: 17న జ‌రిగే భేటీపై సోము వీర్రాజు వ్యాఖ్య‌లు

  • ప్ర‌త్యేక హోదా ఏపీకి సంబంధించిన అంశం
  • ఏపీ, తెలంగాణ ప్ర‌భుత్వానికి మ‌ధ్య ఆస్తుల పంప‌కంపై 17 భేటీ
  • అందులో ప్ర‌త్యేక హోదా అంశం పెట్ట‌కూడ‌దు
  • కావాలంటే ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌త్యేక హోదా గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌తిపాద‌న చేయాలి
somu veerraju slams on special catogiry status

ఏపీ రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత‌ పరిష్కారం కాకుండా మిగిలిపోయిన సమస్యలపై కేంద్ర ప్ర‌భుత్వం సమావేశం ఏర్పాటు చేయాల‌ని కీల‌క నిర్ణయం తీసుకున్న విష‌యం తెలిసిందే. ఈ నెల 17న ఉదయం 11 గంటల‌కు కమిటీ తొలి భేటీ నిర్వహిస్తామ‌ని, వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరగనున్న ఈ సమావేశంలో ప్ర‌త్యేక హోదా అంశం కూడా చ‌ర్చిస్తామ‌ని మొద‌ట కేంద్ర స‌ర్కారు ప్ర‌క‌ట‌న చేసింది. అయితే, మ‌ళ్లీ స‌మావేశ అజెండా నుంచి ప్ర‌త్యేక హోదా అంశాన్ని తొల‌గించింది. దీనిపై విమ‌ర్శ‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో బీజేపీ ఏపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు స్పందించారు.

ప్ర‌త్యేక హోదా అనే అంశం మ‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు సంబంధించిన అంశం. కానీ, 17వ తేదీన ఏర్పాటు చేసే అంశం మ‌న ప్ర‌భుత్వానికి, తెలంగాణ ప్ర‌భుత్వానికి మ‌ధ్య ఉన్న ప‌లు అంశాల‌కు సంబంధించిన స‌మావేశం. విద్యుత్తుతో పాటు అనేక సంస్థ‌ల్లో ఆస్తుల పంప‌కానికి సంబంధించిన అంశంపై చ‌ర్చిస్తారు. ఈ ప్ర‌త్యేక హోదాకు అంశానికి తెలంగాణ‌కు ఎలాంటి సంబంధ‌మూ లేదు. అందులో ప్ర‌త్యేక హోదా అంశం పెట్ట‌కూడ‌దు.

కావాలంటే ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌త్యేక హోదా గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌తిపాద‌న చేస్తే, ఏపీ స‌ర్కారుతో ప్ర‌త్యేకంగా స‌మావేశం ఏర్పాటు చేయ‌వ‌చ్చు. అంతేగానీ, తెలంగాణ‌కు ఏం సంబంధం ప్ర‌త్యేక హోదా గురించి. ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం పాల్గొంటోన్న స‌మావేశంలో ప్ర‌త్యేక హోదా అంశాన్ని ఎలా చ‌ర్చిస్తారు? అని సోము వీర్రాజు ప్ర‌శ్నించారు. ఏపీ ప్ర‌భుత్వ విధానాలు బాగోలేవ‌ని, కేంద్ర ప్ర‌భుత్వం ఏపీ అభివృద్ధికి కృషి చేస్తోంద‌ని, ప్రాజెక్టుల‌కు జ‌గ‌న్ ప్ర‌భుత్వం భూములు ఇవ్వ‌ట్లేద‌ని ఆయ‌న ఆరోపించారు. 

  • Loading...

More Telugu News