పసిఫిక్ చిరు ద్వీపదేశంలో కరోనా... ఆపన్నహస్తం అందించిన భారత్

India helps Kiribati
  • దాదాపు రెండేళ్లపాటు కరోనాకు నో ఎంట్రీ
  • అద్భుతరీతిలో కట్టడి చేసిన పసిఫిక్ దీవులు
  • ఇటీవలే సరిహద్దులు తెరిచిన వైనం
  • పసిఫిక్ దీవుల్లోనూ కరోనా ప్రవేశం
ప్రపంచంలో అత్యధిక దేశాలు గత రెండేళ్లుగా కరోనాతో అతలాకుతలం అవుతుంటే, పేద దేశాలైన పసిఫిక్ ద్వీపదేశాలు మహమ్మారి వైరస్ ను సమర్థంగా నిలువరించాయి. అయితే ఇటీవల పసిఫిక్ ద్వీపదేశాల్లోనూ కరోనా ప్రవేశించింది. అతిచిన్న ద్వీపదేశం కిరిబాటి కూడా వైరస్ ధాటికి గురైంది. కరోనా మహమ్మారి ప్రపంచదేశాల్లో వెలుగుచూడగానే, సరిహద్దులు మూసేసిన దేశాల్లో కిరిబాటి ముందు వరుసలో ఉంటుంది. ఇటీవలే సరిహద్దులు తెరిచిన ఈ దీవి గత రెండేళ్లుగా విదేశాల్లో చిక్కుకుపోయిన తమ పౌరులను స్వదేశానికి తరలించింది.

ఈ క్రమంలో కిరిబాటిలోనూ కరోనా వ్యాప్తి మొదలైంది. పేద దేశం కావడంతో కరోనా సంక్షోభాన్ని తట్టుకోవడం శక్తికి మించిన పనైంది. ఈ నేపథ్యంలో, భారత్ బాసటగా నిలిచింది. వైద్య పరికరాలను భారీ ఎత్తున కిరిబాటికి పంపించింది. పల్స్ ఆక్సీమీటర్లు, పీపీఈ కిట్లు, కొవిడ్ చికిత్సలో ఉపయోగించే అత్యవసర ఔషధాలు, అత్యవసర సహాయ సామగ్రి తరలించింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. కాగా, భారత్ పంపిన వస్తు సరంజామాను కిరిబాటికి చేరవేయడంలో ఆస్ట్రేలియా సాయపడింది.
Go Back to Shorts
Kiribati
India
Corona Virus
Pacific Islands

More Telugu News