Uttar Pradesh: మెడలు విరిచి దళిత యువతి దారుణ హత్య.. యూపీలో మాజీ మంత్రి తనయుడి ఆశ్రమం సెప్టిక్ ట్యాంక్ లో మృతదేహం

  • రెండు నెలల క్రితం కనిపించకుండాపోయిన యువతి
  • నిన్న బయటపడిన మృతదేహం
  • పోస్ట్ మార్టంలో విస్తుపోయే విషయాలు
Unnao Dalit Woman Strangulated To Death with Broken Neck

ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ లో మరో దారుణం జరిగింది. 22 ఏళ్ల దళిత యువతిని అత్యంత కిరాతకంగా హత్య చేశారు. గొంతు నులిమి, మెడలు విరిచేసి దారుణంగా చంపేశారు. చాలా ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రెండు నెలల క్రితం కనిపించకుండా పోయిన ఓ యువతి.. నిన్న ఉన్నావ్ లో శవమై కనిపించింది. సమాజ్ వాదీ పార్టీకి చెందిన యూపీ మాజీ మంత్రి ఫతే బహదూర్ సింగ్ కుమారుడు రాజోల్ సింగ్ కు చెందిన ఆశ్రమంలో ఆమె మృతదేహాన్ని గుర్తించారు.

దుండగులు మృతదేహాన్ని దుప్పటిలో చుట్టి సెప్టిక్ ట్యాంక్ లో పడేశారు. ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్ మార్టం కోసం పంపించారు. పోస్ట్ మార్టంలో ఈ విస్తుపోయే నిజాలు తెలిశాయి. మెడలు విరిచేయడంతో పాటు తలమీద రెండు గాయాలున్నట్టు తేలింది.

కాగా, డిసెంబర్ 8న తమ బిడ్డ కనిపించకుండా పోయిందని, పోలీసులకు ఫిర్యాదు చేసినా వెంటనే స్పందించలేదని చనిపోయిన యువతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఎవరితోనో పారిపోయింది.. వస్తుందిలే అంటూ గేలి చేశారని అన్నారు. ఎస్పీని కూడా కలవనివ్వలేదన్నారు. అయితే, ఆ ఆరోపణలను పోలీసులు ఖండించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఎస్పీ శశి శేఖర్ సింగ్ చెప్పారు. కేసుకు సంబంధించి మాజీ మంత్రి కుమారుడు రాజోల్ సింగ్ ను విచారిస్తున్నామన్నారు.

More Telugu News