Gorantla Butchaiah Chowdary: టాలీవుడ్‌లో స‌మ‌స్య‌ను సృష్టించి మళ్లీ దాన్ని ప‌రిష్క‌రించిన‌ట్లు రాజ‌కీయాలు: టికెట్ల వివాదంపై గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి

  • నిన్న జ‌గ‌న్‌తో టాలీవుడ్ ప్ర‌ముఖుల భేటీ
  • వారం/ప‌ది రోజుల్లోనే ఓ శుభవార్త వ‌స్తుంద‌న్న మ‌హేశ్ బాబు
  • టికెట్ ధ‌రల వివాదానికి శుభంకార్డు ప‌డింద‌న్న చిరు
  • అసలు ఎవరు సినిమా రేట్లు తగ్గించమన్నారు?...
  • ఎవరు పెంచమన్నారు వైఎస్ జ‌గ‌న్? అంటూ గోరంట్ల విమ‌ర్శ‌లు
gorantla fires on jagan

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ సీఎం జగన్‌తో తెలుగు సినీ ప్రముఖులు నిన్న స‌మావేశ‌మై టాలీవుడ్‌లోని స‌మ‌స్య‌లపై చ‌ర్చించిన విష‌యం తెలిసిందే. ప్ర‌భుత్వం ముందు టాలీవుడ్ ప్ర‌ముఖులు ప‌లు ప్ర‌తిపాద‌న‌లు ఉంచడం, కొన్నింటికి జ‌గ‌న్ సానుకూలంగా స్పందించ‌డం వంటి ప‌రిణామాలతో ఇప్ప‌టికే టాలీవుడ్ హ‌ర్షం వ్య‌క్తం చేస్తోంది. వారం/ప‌ది రోజుల్లోనే ఓ శుభవార్త వ‌స్తుంద‌ని సినీనటుడు మ‌హేశ్ బాబు కూడా ప్ర‌క‌టించాడు.

టికెట్ ధ‌రల వివాదానికి శుభంకార్డు ప‌డింద‌ని భావిస్తున్నామ‌ని చిరంజీవి చెప్పారు. దీంతో ఈ విష‌యాల‌ను ప్ర‌స్తావిస్తూ టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌద‌రి ఏపీ స‌ర్కారుపై ప‌లు ఆరోప‌ణ‌లు చేశారు. స‌మ‌స్య‌ను ఉద్దేశ‌పూర్వ‌కంగానే సృష్టించి, మ‌ళ్లీ వాటిని ప‌రిష్క‌రించిన‌ట్లు రాజకీయాలు చేస్తున్నార‌ని ఆయ‌న ఆరోపించారు.

''అసలు ఎవరు సినిమా రేట్లు తగ్గించమన్నారు... ఎవరు పెంచమన్నారు వైఎస్ జ‌గ‌న్? మీరే సమస్యను సృష్టించి మీరే పరిష్కరించిన్నట్లు డైవర్షన్ పాలిటిక్స్ చేయడం మీకే చెల్లింది.. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల దౌర్భాగ్యం" అని గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి ట్వీట్ చేశారు. #FailedCMjagan, #JaganMarkDiversionPolitics అంటూ ఆయ‌న హ్యాష్‌ట్యాగ్‌లు జోడించారు.

More Telugu News