Meesho: జీవితాంతం ఇంటి నుంచి, నచ్చిన చోటు నుంచే పని.. ఉద్యోగులకు మీషో బంపరాఫర్.. వర్క్ ప్లేస్ మోడల్ నే మార్చేసిన సంస్థ

  • శాటిలైట్ ఆఫీసులనూ పెట్టేందుకు రెడీ
  • స్త్రీ, పురుషులన్న తేడాల లేకుండా అందరికీ 30 వారాల పేరెంటల్ లీవ్స్
  • ఆరేళ్ల లోపు పిల్లలుంటే ‘డే కేర్’ సౌలభ్యం
  • వర్క్ ప్లేస్ మోడల్ లో సమూల మార్పులకు బాటలు
Meesho Re Defines Work Place Model To Create Employee Centric Rules

కరోనాతో ఇప్పటికీ చాలా మంది ఇంటి నుంచే పనిచేస్తున్నారు. మొన్నామధ్య ఉద్యోగులను ఆఫీసులకు రప్పించాలని సంస్థలు ప్రయత్నాలు చేసినా.. ఒమిక్రాన్ రూపంలో మళ్లీ అది వెనక్కు పడిపోయింది. అయితే, ఆన్ లైన్ రిటైల్ షాపింగ్ సంస్థ తన ఉద్యోగులకు ఓ బంపరాఫర్ ఇచ్చింది. పనికి అవధుల్లేని వర్క్ ప్లేస్ మోడల్ ను ప్రకటించింది. జీవితాంతం ఇంటి నుంచే పనిచేసే వెసులుబాటును కల్పించింది.

ఇంటి నుంచేంటి.. ఎక్కడ వీలైతే అక్కడ పనిచేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. ఉద్యోగి తనకు నచ్చిన చోటు, ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ పనిచేసుకునేందుకు మంచి అవకాశాన్నిచ్చింది. ఉద్యోగులు అడిగితే శాటిలైట్ ఆఫీసులను పెట్టేందుకూ సంస్థ సిద్ధమైంది. నైపుణ్యం కలిగిన ఉద్యోగులు ఎక్కువగా ఉండేచోటే ఆఫీసును నెలకొల్పనుంది.

ఉద్యోగులు పనిపై ఆసక్తి పెంచుకునేలా ప్రోత్సాహకాలు ఇవ్వనుంది. అవకాశాల కల్పన కోసం వర్చువల్ కొలాబరేషన్ టూల్స్ ను ప్రవేశపెడుతోంది. త్రైమాసిక సమావేశాలు, వార్షిక సదస్సుల వంటి కార్యక్రమాల కోసం గోవా వంటి పర్యాటక ప్రాంతాలకు ఉద్యోగులను పంపనుంది. ఉద్యోగులకు ఆరేళ్ల లోపు పిల్లలుంటే ‘డే కేర్’ను స్పాన్సర్ చేయనుంది. బెంగళూరులోని హెడ్డాఫీసుకు అధికారిక పర్యటనలకు వెళ్లినా డే కేర్ వెసులుబాటును సంస్థ కల్పించనుంది.

క్రీడలు, మారథాన్ లు, సామాజిక కార్యక్రమాల వంటి వాటిలో వర్క్ ప్లేస్ రీజనల్ కమిటీల్లో ఉద్యోగులూ భాగస్వాములను చేసింది. అంతేగాకుండా స్త్రీ, పురుషులు అన్న తేడా లేకుండా 30 వారాల (7 నెలలు) పాటు పేరెంటల్ లీవ్స్ ను కల్పించి లింగ సమానత్వాన్ని చాటింది.

తమ వ్యాపారంలో ఉద్యోగులే కీలకమని, అందుకే వారికి అనుకూలంగా ఉండేలా వర్క్ ప్లేస్ ను ఏర్పాటు చేస్తున్నామని మీషో సీహెచ్ఆర్ వో ఆశిష్ కుమార్ సింగ్ అన్నారు. పరిశ్రమ వర్గాల్లోనే తొలిసారిగా ఇలాంటి అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. సంప్రదాయ పని ప్రదేశ నియమాలను పునర్నిర్వచిస్తున్నామని, కొత్త విధానాలను తీసుకొస్తున్నామని ఆయన తెలిపారు.

More Telugu News