asteroid: భూమి సమీపానికి రానున్న 1.3 కిలోమీటర్ల గ్రహశకలం

  • మార్చి 4న వస్తుంది
  • భూమికి 49,11,298 కిలోమీటర్ల చేరువగా
  • మళ్లీ తిరిగి 2043లో చేరువగా రాక  
  • నాసా జెట్ ప్రొపల్షన్ ల్యాబరేటరీ వెల్లడి
wide asteroid headed towards Earth

భారీ గ్రహశకలం (ఆస్టరాయిడ్) ఒకటి భూమి వైపు వేగంగా దూసుకువస్తోంది. సుమారు 1.3 కిలోమీటర్ల పరిమాణంలో ఉన్న గ్రహశకలం మార్చి 4వ తేదీన భూమికి సమీపానికి వస్తుందని నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ లేబరేటరీ (జేపీఎల్) ప్రకటించింది. భూమికి 49,11,298 కిలోమీటర్ల చేరువగా వచ్చి వెళుతుందని అంచనా వేసింది. ప్రమాదకరమైన గ్రహశకలంగా దీనిని పేర్కొంది.

138971 (2001 సీబీ21) పేరుతో పిలిచే ఈ గ్రహశకలం సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తున్నట్టు జేపీఎల్ తెలిపింది. కేవలం 400 రోజుల్లోనే ఒక పర్యాయం చుట్టి వస్తోందని.. గంటకు 43,236 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తున్నట్టు వెల్లడించింది.

చివరిగా ఇదే గ్రహశకలం 2006లో భూమికి చేరువగా వచ్చి వెళ్లింది. అప్పుడు 71,61,250 కిలోమీటర్ల సమీపానికి వచ్చింది. అంటే ఈ సారి ఇంకొంచెం దగ్గరగా రానుంది. ఈ ఏడాది మార్చి 4 తర్వాత.. మళ్లీ 2043లో ఇదే గ్రహశకలం భూమికి చేరువగా వస్తుందని జేపీఎల్ తెలిపింది. అప్పుడు ఇంకాస్త దగ్గరగా 48,15,55 కిలోమీటర్ల సమీపానికి వచ్చి వెళుతుందని అంచనా వేసింది. 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం సౌరకుటుంబం ఏర్పడినప్పుడు మిగిలిపోయిన రాతిశకలాలనే గ్రహశకలాలుగా చెబుతారు.

More Telugu News