Lata Mangeshkar: ఎంపీగా ఒక్క రూపాయి కూడా జీతం తీసుకోని ఒకప్పటి ‘హేమ’.. ‘లతా’ మంగేష్కర్ అని పేరెందుకు మార్చుకున్నారు?.. ఆశా భోంస్లే ఆమె సొంత చెల్లెలని తెలుసా?

  • భవబంధన్ అనే నాటకాన్ని రాసిన తండ్రి
  • అందులోని ‘లత’ పాత్ర నచ్చి పేరు మార్చుకున్న హేమ
  • పాటలు నేర్పుతుంటే స్కూలు నుంచి గెంటేసిన టీచర్లు
  • నగ్న బొమ్మ అంటూ ఫిల్మ్ ఫేర్ అవార్డునే తిరస్కరించిన గాయని
  • ఇంగ్లండ్ లార్డ్స్ స్టేడియంలో ఆమె పేరిట శాశ్వత గ్యాలరీ
Why Hema Turned Out To Be Lata Mangeshkar

లతా మంగేష్కర్.. ఈ పేరు తెలియనివారు దాదాపు ఉండరు. పాటతో అందరి నోళ్లల్లో నానిన పేరది. మరి, హేమ అంటే తెలుసా? లతా మంగేష్కర్ అసలు పేరది. అసలు పేరుకు తగ్గట్టు ఆమె మనసు కూడా బంగారమే. మరి, అసలు పేరు కాకుండా.. కొసరుపేరుతోనే ఆమె ఎందుకంత ఫేమస్ అయ్యారో తెలుసా?

ఆమె తండ్రి దీనానాథ్ మంగేష్కర్ స్వయాన గాయకుడు కావడం, రంగస్థల నాటకరంగంలో ఉండడంతో.. ‘భవబంధన్’ అనే నాటకాన్ని రాశారు. ఆ నాటకంలోని పాత్ర పేరు ‘లతిక’. ఆ రోల్ ఎంతగానో నచ్చేయడంతో అప్పటిదాకా ‘హేమ’గా ఉన్న ఆమె.. తన పేరును లతగా మార్చుకున్నారు. ఆమెలోని గాయనిని ఆమె తండ్రే గుర్తించారు.

స్కూల్ కు రావొద్దన్న టీచర్లు

ఆమె స్కూల్ కు వెళ్లి తోటి విద్యార్థులకు పాటలు నేర్పుతుండడంతో.. టీచర్లు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసేవారు. అసలు స్కూల్ కు రావొద్దంటూ ఆమెకోసారి టీచర్లు చెప్పేశారు. దీంతో ఆమె స్కూలుకు వెళ్లడం మానేశారంటేనే ఆమెకు పాటలంటే ఎంత మక్కువో అర్థం చేసుకోవచ్చు. అయితే, తన చెల్లెలు ఆశా భోంస్లేని కూడా స్కూలుకు రానివ్వకపోవడం వల్లే తాను స్కూలు మానేశానని ఓ ఇంటర్వ్యూలో ఆమె చెప్పడం మరో విశేషం.

ఇదీ ఆమె కుటుంబం...

1942లో తండ్రి చనిపోయాక.. కుటుంబ పెద్దగా లతా మంగేష్కర్ బాధ్యతలను భుజానికెత్తుకున్నారు. చెల్లెళ్లు మీనా, ఆశా భోంస్లే, ఉషా మంగేష్కర్, తమ్ముడు హృదయనాథ్ మంగేష్కర్ బాధ్యతలను ఆమె చూసుకున్నారు. తొలుత కొంత మంది సంగీత దర్శకులు ఆమెను తిరస్కరించారు. గొంతు బాగాలేదని చెప్పి అవకాశాలు ఇవ్వలేదు. 1949లో తొలిసారి మహల్ అనే చిత్రంలో పాడిన ‘ఆయేగా ఆనేవాలా’ అనే పాటతో ఆమెకు గుర్తింపు వచ్చింది. అక్కడి నుంచి ఆమె పాటలు ఎంత పాపులర్ అయ్యాయో.. ఆమె గాత్రాన్ని ఎంత మంది ఇష్టపడ్డారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

లతా మంగేష్కర్ కు క్రికెట్ అంటే ఎంతో ఇష్టం. ఇంగ్లండ్ లోని లార్డ్స్ స్టేడియంలో ఆమె పేరిట ఓ స్పెషల్ గ్యాలరీ ఉందంటే నమ్ముతారా? రాజ్యసభ ఎంపీగానూ ఆమె సేవలందించారు. 1999 నవంబర్ 22 నుంచి 2005 నవంబర్ 21 వరకు ఎంపీగా కొనసాగారు. ఆ సమయంలో ఆమె ఒక్క రూపాయి కూడా జీతం తీసుకోలేదంటే ఆశ్చర్యం కలుగకమానదు. 1962లో చైనా యుద్ధం సమయంలో ఆమె పాడిన ‘ఆయే మేరే వతన్ కో లోగోం’ అనే పాట ఎంత పాపులర్ అయ్యిందో.. ఆ పాట విన్నప్పుడల్లా రోమాలు ఎంతలా నిక్కబొడుచుకుంటాయో తెలిసిందే.

ఫిల్మ్ ఫేర్ అవార్డునూ వద్దన్నారు..

1953లో తొలిసారిగా లతా మంగేష్కర్ కు ఫిల్మ్ ఫేర్ అవార్డు వచ్చినా ఆమె తొలుత తీసుకోవడానికి అభ్యంతరం వ్యక్తం చేశారు. దుస్తులు చుట్టని నగ్నంగా ఉన్న ఓ మహిళ ప్రతిమను తాను అవార్డుగా స్వీకరించలేనని ఆమె సుస్పష్టంగా నిర్వాహకులకు తేల్చి చెప్పారు. దీంతో ఆ బొమ్మకు కర్చీఫ్ ను చుట్టి అవార్డును ఇవ్వడంతో ఆమె స్వీకరించారు. 

More Telugu News