Shankar Narayana: షూటింగులు లేనప్పుడే బాలకృష్ణకు హిందూపురం ప్రజలు గుర్తొస్తారు: మంత్రి శంకర్ నారాయణ

  • హిందూపురంలో బాలయ్య మౌనదీక్ష
  • ప్రత్యేక జిల్లా కేంద్రం కోసం ప్రయత్నం
  • ఏడేళ్లుగా హిందూపురానికి ఏమీ చేయలేదన్న మంత్రి 
AP Minister Shankar Narayana slams Balakrishna

కొత్తగా ప్రకటించిన సత్యసాయి జిల్లాకు హిందూపురంను కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ నేడు మౌనదీక్ష చేపట్టడం తెలిసిందే. దీనిపై ఏపీ మంత్రి శంకర్ నారాయణ స్పందించారు. సినిమా షూటింగులు లేనప్పుడే బాలకృష్ణకు హిందూపురం ప్రజలు గుర్తొస్తారని విమర్శించారు. హిందూపురానికి ఆయన చుట్టపుచూపుగా వస్తుంటారని అన్నారు.

ఏడేళ్లు హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ నియోజకవర్గ అభివృద్ధికి ఏంచేశారో చెప్పాలని మంత్రి నిలదీశారు. బాలకృష్ణ రాజీనామా చేయాలని హిందూపురం ప్రజలే కోరుకుంటున్నారని వెల్లడించారు.

పెనుకొండ జిల్లా కేంద్రం కావాలని తమకూ ఓ కోరిక ఉందని, అయితే ఆధ్యాత్మిక పట్టణం పుట్టపర్తి కేంద్రంగా జిల్లాను ప్రకటించడం తమకు ఆనందం కలిగించిందని చెప్పారు. రాజకీయ ఉనికి కోసమే బాలకృష్ణ మౌనదీక్షలు చేస్తున్నారని మంత్రి శంకర్ నారాయణ వ్యాఖ్యానించారు. ఇలాంటి దీక్షలతో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి, రాజకీయ లబ్ది పొందాలనుకుంటున్నారా? అని ప్రశ్నించారు.

More Telugu News