Somu Veerraju: జగన్ తనను తాను నిర్బంధించుకున్నట్టే!: సోము వీర్రాజు

  • ఉద్యోగులు వారి హక్కుల కోసం శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు
  • ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య విభేదాలు రాష్ట్రానికి మంచిది కాదు
  • వైసీపీ ప్రభుత్వం అప్పుల కోసం తిప్పలు పడుతోందన్న వీర్రాజు 
Somu Veerraju fires on Jagan

పీఆర్సీ విషయంలో ఏపీ ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య వార్ కొనసాగుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఉద్యోగులు రేపు 'ఛలో విజయవాడ'కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఛలో విజయవాడ కార్యక్రమానికి పోలీసులు అనుమతిని నిరాకరించారు. ఉద్యోగ సంఘాల నేతలను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు.

ఈ సందర్భంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఉద్యోగులు వారి హక్కుల కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్నారని... వారిని నిర్బంధించే చర్యలను మానుకోవాలని అన్నారు. ఉద్యోగ సంఘాలను నిర్బంధించడం అంటే... సీఎం జగన్ తనను తాను నిర్బంధించుకోవడమేనని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య మాటల యుద్ధం రాష్ట్రానికి మంచిది కాదని అన్నారు.

వైసీపీ ప్రభుత్వం అప్పుల కోసం తిప్పలు పడుతోందని... ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలనే అజెండా కూడా ప్రభుత్వం వద్ద లేదని వీర్రాజు విమర్శించారు. ఇసుక విషయంలో ప్రభుత్వం చెపుతున్న లెక్కలు అర్థం కాకుండా ఉన్నాయని అన్నారు.

వేల కోట్ల విలువ చేసే గనులు ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉన్నాయని ఆరోపించారు. ఇసుక రూపంలో రూ. 5 వేల కోట్లు, ఎర్ర చందనం అమ్మకంతో రూ. 3 వేల కోట్లు ఆదాయం వస్తోందని అన్నారు. ఈ సొమ్మును ఎక్కడికక్కడ దోచుకుంటున్నారని... ప్రభుత్వానికి ఆదాయం చేరడం లేదని వీర్రాజు  దుయ్యబట్టారు.

  • Loading...

More Telugu News